గవర్నర్, సీఎం కేసీఆర్ మధ్య గ్యాప్ కు కారణం ఈటల: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలనం
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గవర్నర్ కు సీఎం కేసీఆర్ కు మధ్య గ్యాప్ కు కారణమైన అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై కి, సీఎం కేసీఆర్ కు మధ్య గ్యాప్ రావడానికి ఈటల రాజేందర్ కారణమంటూ ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం వరంగల్ పర్యటనలో భాగంగా వేయి స్తంభాల దేవాలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం వల్లే గవర్నర్ పై కేసీఆర్ కు కోపం వచ్చిందని పేర్కొన్నారు.

కేసీఆర్ ప్రోత్సాహంతోనే టిఆర్ఎస్ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు
సీఎం కేసీఆర్ ఆ తర్వాత నుండి గవర్నర్ ను అవమానిస్తున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. సమ్మక్క సారలమ్మ జాతరకు గవర్నర్ తమిళిసై వస్తే కలెక్టర్ గాని, ఎస్పీ గాని లేకపోవడం అవమానకరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన కేసీఆర్, కేటీఆర్ లు దిగజారి మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్నది తెలంగాణ సమాజం గమనిస్తున్నదన్న కిషన్ రెడ్డి బీజేపీని తిట్టాలని టిఆర్ఎస్ అధిష్టానం ప్రోత్సహిస్తున్న కారణంగానే, టిఆర్ఎస్ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది
ఇక కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు దశలవారీగా వస్తాయని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు అమలు చేయడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం పై ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని పేర్కొన్నారు . ఇక వరంగల్ నగర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో ప్రాధాన్యత ఇస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. భారత ప్రభుత్వం వరంగల్ ను హెరిటేజ్ సిటీగా ప్రకటించిందని పేర్కొన్న కిషన్ రెడ్డి, రామప్పకు యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో కేంద్రం ఎంతగానో కృషి చేసిందని తెలిపారు.

రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి
రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా 112 వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి పై ప్రధాని దృష్టి సారించారని పేర్కొన్నారు. వేయి స్తంభాల దేవాలయం కళ్యాణ మండపం గురించి ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పామని పేర్కొన్న కిషన్ రెడ్డి, రామప్ప కోసం మూడు కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, టూరిజం ప్రసాద్ స్కీమ్ కింద 50 కోట్లతో సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. భద్రాచలం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని పేరు తెలిపిన ఆయన డి పి ఆర్ వచ్చిన తర్వాత పనులు చేపడతామని వెల్లడించారు. ఇక ములుగులో ట్రైబల్ సర్క్యూట్ ను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

ఏపీలో అల్లూరి జయంతి .. ప్రధాని హాజరవుతారు : కిషన్ రెడ్డి
ఘంటసాల శతాబ్ది ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతోంది అని పేర్కొన్న కిషన్ రెడ్డి, జులై 4వ తేదీన అల్లూరి 125వ జయంతిని ఏపీలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. దీనికి ప్రధాని కూడా హాజరవుతారని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆగస్టు 15న 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్న కిషన్ రెడ్డి ఆ రోజు దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటా జాతీయ పతాకం ఎగరాలి అని, జాతీయగీతం ఆలపించాలి అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications