ఏపీకి ప్రత్యేక హోదా హుళక్కే! ఇవీ నిబంధనలు: కేంద్రమంత్రి లేఖ
ఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పట్లో రాదని మరోసారి తేలింది! తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పైన కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ ప్రత్యుత్తరం రాశారు.
ప్రస్తుతం హోదా ఇచ్చి ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద లేదని కేంద్రమంత్రి చెప్పారు. ప్రత్యేక హోదా దిశగా కేంద్రం ఆలోచనలు చేయడం లేదని చెప్పారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్, బీహార్, చత్తీస్గఢ్, తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాలు ప్రత్యేక హోదాను అడుగుతున్నాయని కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ చెప్పారు. గత నిబంధనల ప్రకారం వెనుకబడిన, గిరిజన ప్రాంతాలు, మౌలిక వసతులు, ఇతర దేశాల సరిహద్దు ప్రాంతాలకు ఎన్డీసీ ప్రత్యేక హోదా ఇచ్చేదన్నారు.
ప్రస్తుతం హోదా ఇచ్చే ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని, ప్రత్యేక హోదా దిశగా కేంద్రం ఆలోచించడం లేదని చెప్పారు. కాగా, కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్.. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ప్రత్యుత్తరం ద్వారా ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఇప్పట్లో రాదని అర్థమైందంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. రైతు సమస్యలే ప్రధాన అజెండాగా సాగే ఈ సమావేశాలకు అధికార, విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో సన్నద్ధమయ్యాయి. రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ, కరవు, వర్షాభావం, పరిహారం పెంపుదల వంటి వాటిపై విస్తృతస్థాయి చర్చలు జరగనున్నాయి.