ఇలాంటి వారు కావాలి: కెటిఆర్పై కేంద్రమంత్రి ప్రశంసల జల్లు
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దారని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్ పైన కేంద్రమంత్రి చౌదరి బీరేందర్ సింగ్ గురువారం ప్రశంసలు కురిపించారు. కేటీఆర్లాంటి యువనాయకుడు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అవసరమన్నారు.
ఇటువంటి నాయకులుంటే దేశం మరింత పురోగతి సాధిస్తుందన్నారు. గురువారం హైదరాబాద్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను, వాటర్గ్రిడ్ల నిర్మాణం, వాటికి సంబంధించిన ప్రణాళికలపై మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రికి వివరించారు. తెలంగాణకు కేంద్రం నుంచి తగినంత సహాయం అందిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

భూగర్భజల వినియోగంతో దీర్ఘకాలంలో ప్రజలకు సమస్యలు వస్తాయని, అయితే వాటర్ గ్రిడ్తో రక్షిత ఉపరితల నీటిని ఇచ్చేందుకు తెలంగాణలో జరుగుతున్న ప్రయత్నం అద్భుతమన్నారు. ప్రతి రాష్ర్టాన్ని ఉపరితల తాగునీటి ప్రాజెక్టులు రూపొందించి తమకు పంపాల్సిందిగా కోరుతామన్నారు.
స్వచ్చ భారత్లో భాగంగా, సొంత నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ చేపట్టిన బహిరంగ మల విసర్జన నిర్మూలన కార్యక్రమాన్ని బీరేందర్సింగ్ మెచ్చుకున్నారు. కేటీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడిగా ఎదుగుతారన్న నమ్మకం తనకు కలిగిందన్నారు.

బహిరంగ మల విసర్జన లేని ప్రాంతాలకు ఎలాంటి పరిమితులు లేకుండా అర్థిక సహాయం అందిస్తామన్నారు. గాంధీ జయంతికి ముందే స్వచ్ఛ్ సిరిసిల్లను సాధించిన కేటీఆర్ అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ ప్రయత్నంతో తెలంగాణలోని ఇతర నియోజకవర్గాల్లో మార్పు రాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications