ఉప్పల్ స్టేడియం రూ.12కోట్ల బకాయి: రెడ్ నోటీస్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఈ వారంలో జరగాల్సిన మూడు ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. హైదరాబాద్ క్రికెట్ అకాడమీ (హెచ్సీఏ) తమకు బాకీ పడ్డ రూ.12 కోట్ల ఆస్తి పన్నును చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చింది.
ఫలితం లేకపోవడంతో ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా), జీహెచ్ఎంసీ, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్తో కలిసి శనివారం స్టేడియాన్ని సీజ్ చేసేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత పలు కారణాల వల్ల వెనక్కి తగ్గారు. అయితే, రెండు రోజుల్లో పన్ను చెల్లించాలని లేదంటే స్టేడియం జప్తు చేస్తామని హెచ్సీఏ ఉపాధ్యక్షులు నరేందర్ గౌడ్కు రెడ్ నోటీసులు నోటీసులు అందాయని తెలుస్తోంది.
అంత పెద్ద మొత్తంలో ఉన్న పన్ను బకాయి హెచ్సీఏ నిర్ణీత సమయంలో చెల్లించని పక్షంలో స్టేడియంలో సోమవారం, ఈ నెల 15, 17వ తేదీల్లో జరగాల్సిన సన్రైజర్స్ మ్యాచ్లకు ఐలా అనుమతిస్తుందా లేదా అనే విషయంపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన నెలకొంది. సోమవారం జరిగే మ్యాచ్ కోసం ఇప్పటికే టిక్కెట్లు కొన్న ప్రేక్షకులు డైలమాలో పడ్డారు.
కాగా, ఉప్పల్ స్డేడియంలో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరగడం లేనందున అంతపెద్ద మొత్తంలో ఆస్తి పన్ను వసూలు చేయడం భావ్యం కాదని హెచ్సీఏ అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోని స్టేడియాలతో పోలిస్తే తమపై ఎక్కువ శాతం పన్ను విధిస్తున్నారని, దీనిపై ముఖ్యమంత్రితో మాట్లాడతామని చెప్పారని సమాచారం.