ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు: మాది ఆదర్శ వివాహం..ఆస్తులు ఎవరికి దానం చేస్తామంటే...?
తెలంగాణ పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖలు చేశారు. ఇప్పటికే కేసీఆర్ టార్గెట్గా ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్న తెలంగాణ కాంగ్రెస్ బాస్... తాజాగా తన వ్యక్తిగత విషయాలను ప్రజలకు తెలిపారు. తన వివాహం పద్మా ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆర్యసమాజ్లో జరిగిందని తనది ఆదర్శ వివాహం అని చెప్పుకొచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతేకాదు కావాలనే తాము పిల్లలను వద్దనుకున్నట్లు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రజలే తమ పిల్లలుగా భావిస్తున్నామని చెప్పారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ కోసం పనిచేస్తామని చెప్పారు.
ఇదిలా ఉంటే ఒకానొక సమయంలో పిల్లలు ఉంటే బాగుండు అనిపించేదని అప్పుడు వికలాంగుడిని దత్తత తీసుకుందామని అనుకున్నట్లు ఉత్తమ్ తెలిపారు. అయితే అది కుదరలేదని... ఇక కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ ప్రజలే తమ పిల్లలని భావించామని చెప్పారు. ఇక తాము సంపాదించినదంతా అంటే తమ ఆస్తిని మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా కార్యకర్తలకు ప్రజలకు ఇస్తామని చెప్పారు. అధికారం ఉన్నా లేకున్నా పదువులు ఉన్నా లేకున్నా.. తమను ప్రజలు గుర్తుపెట్టుకుంటే అదే తమకు తృప్తినిస్తుందని చెప్పారు.
ఇక ప్రచారంలో ప్రజాకూటమి దూసుకెళుతోందని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికల్లో మహాకూటమి గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీసుకోనని శపథం చేసినట్లు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసెంబర్ 12న తన గడ్డం తీసేస్తానంటూ చెప్పారు. తద్వారా ప్రజాకూటమి గెలుపు ఖాయమని పరోక్ష సంకేతాలు పంపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.