'అలా మార్చి, కాంగ్రెస్ మేనిఫెస్టోను మక్కీకి మక్కి దించిన కేసీఆర్, కేటీఆర్ ఏమంటారు'
హైదరాబాద్: నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డాయని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు మక్కీకి మక్కీ తమ మేనిఫెస్టోను కాపీ కొట్టారని ఆరోపించారు. తమ హామీలపై దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ అంతా కలిపినా సరిపోదని కేటీఆర్ విమర్శలు చేశారని గుర్తు చేశారు. మావి తప్పుడు హామీలన్న కేటీఆర్ ఇప్పుడేం చెబుతారని నిలదీశారు.
57 ఏళ్లకే పింఛన్, నిరుద్యోగ భృతి రూ.3,016, అగ్రవర్ణ పేదలకు అండ: కేసీఆర్, టీఆర్ఎస్ మేనిఫెస్టో ఇదీ..
టీఆర్ఎస్ మునిగిపోతున్న నావ అని కేసీఆర్ చెప్పకనే చెప్పారన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ ఒక్క కుటుంబాన్ని పరామర్శించలేదని మండిపడ్డారు. కేసీఆర్ ఈ రోజు మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అంగీకరించినట్లేనని చెప్పారు. 2014లో ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడారన్నారు.
ఇవన్నీ కేసీఆర్ నెరవేర్చలేదు
రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకు మనిషికి 7 కిలోల రేషన్ బియ్యం ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దళితులు, గిరిజనులకు తొమ్మిది రకాల రేషన్ వస్తువులు ఉచితంగా ఇస్తామని చెప్పారు. సంవత్సరానికి ఆరు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. 40 లక్షల గిరిజనుల్లో ఒక్కరికీ కేసీఆర్ భూమి ఇవ్వలేదని చెప్పారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో మోసం చేశారన్నారు.
కేసీఆర్ సిగ్గుపడాలి
వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని, మేం చెప్పిన అంశాలనే కేసీఆర్ చెప్పారని, అందుకు ఆయన సిగ్గుపడాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. తాము నిరుద్యోగ భృతి ఇస్తామంటే తప్పు పట్టిన కేసీఆర్ ఇప్పుడు తాను ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. మార్కెట్ ఫండ్ గురించి కేసీఆర్ పదవి నుంచి దిగిపోయాక మాట్లాడుతున్నారన్నారు.
12 లక్షల మంది నిరుద్యోగులున్నారని కేసీఆర్ అంగీకరించారు
అలాగే ఉద్యోగాలపై మభ్యపెట్టిన కేసీఆర్ 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అంగీకరించారని తెలిపారు. వీరికి ఉద్యోగాలు ఇవ్వకుండా నాలుగున్నరేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలను తప్పుపట్టిన కేటీఆర్ ఇప్పుడు ఏమంటారని నిలదీశారు.
ఇదిగో.. కాంగ్రెస్ మేనిఫెస్టోను మార్చి!
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారని గూడురు నారాయణ రెడ్డి అన్నారు. రూ.2వేలు పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ హామీకి భయపడే కేసీఆర్ పెంచారని విమర్శించారు. పింఛన్ వయోపరిమితిని మేం 58 చేస్తే కేసీఆర్ 57 చేశారని ఎద్దేవా చేశారు.