హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిల్లర పడేశారు.. లక్షలు దోచేశారు.. ఏటీఎం నగదు చోరీలో డైవర్షన్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధానిలో దొంగలు రెచ్చిపోయారు. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలో చోరీకి పాల్పడ్డారు. చకచకా క్షణాల్లో లక్షలకు లక్షలు దోచేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఏటీఎం నగదు సమకూర్చే సిబ్బందిని ఏమార్చి చాలా ఈజీగా నగదు నొక్కేశారు. మీ డబ్బులు కిందపడ్డాయంటూ సెక్యూరిటీ గార్డును బురిడీ కొట్టించి అమాంతంగా ఓ క్యాష్ బాక్స్ ను ఎత్తుకెళ్లారు. చిల్లర పడేసి లక్షలు మాయం చేశారు. సీసీ ఫుటేజ్ చూస్తే దొంగలు ఎంత చాకచక్యగా వ్యవహరించారో అర్థమవుతుంది. అంతర్ రాష్ట్ర దొంగల ముఠా పనిగా భావిస్తున్న రాచకొండ పోలీసులకు కీలకాధారాలు లభించాయి.

పోలీస్ కస్టడీకి హాజీపూర్ కిల్లర్.. విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు..!పోలీస్ కస్టడీకి హాజీపూర్ కిల్లర్.. విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు..!

ఏటీఎం నగదుపై కన్ను

రాష్ట్ర రాజధానిలో మంగళవారం (07.05.2019) ఉదయం జరిగిన భారీ చోరీ కలకలం రేపింది. ఏటీఎంలలో నగదు నింపే సిబ్బందికి మస్కా కొట్టి పెద్దమొత్తంలో దోచుకెళ్లారు. బేగంపేటలోని ఓ ప్రైవేట్ సంస్థ.. ఏటీఎం యంత్రాల్లో నగదు పెట్టే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అందులోభాగంగా ఎప్పటిలాగే మంగళవారం ఉదయం తమ వాహనంలో నగదు పెట్టెలతో బయలుదేరారు. ఆబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏటీఎంల్లో క్యాష్ పెట్టిన అనంతరం వనస్థలిపురం చేరుకున్నారు. అక్కడ పనామా చౌరస్తాలోని ఓ ప్రైవేట్ బ్యాంకు ఏటీఎంలో డబ్బు పెట్టేందుకు తమ వాహనాన్ని పక్కకు నిలిపి ఉంచారు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న దొంగలు క్షణాల్లో తమ పని కానిచ్చారు.

ఆ వాహనంలో మొత్తం నలుగురు సిబ్బంది ఉన్నారు. డ్రైవర్, సెక్యూరిటీ గార్డుతో పాటు మరో ఇద్దరున్నారు. వాహనాన్ని అక్కడ నిలిపి డ్రైవర్ అలా పక్కకు వెళ్లాడు. మిగతా ఇద్దరు ఏటీఎంలో డబ్బు పెట్టడానికి వెళ్లారు. ఇక మిగిలింది గార్డు ఒక్కరే. అదే అదనుగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. అతడిని డైవర్ట్ చేసి ఎంచక్కా 58 లక్షలతో చెక్కేశారు.

చిల్లరేశారు.. లక్షలు దోచారు

చిల్లరేశారు.. లక్షలు దోచారు

తిప్పికొడితే 400 రూపాయలు లేవు. కానీ అదే చిల్లరతో 58 లక్షల రూపాయలు కొట్టేశారు దొంగలు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు నగదు పెట్టెలున్న వాహనం దగ్గరకు వచ్చారు. అందులో ఒకడు ముందువైపుకెళ్లి మూడు 100 రూపాయల నోట్లు, పది వరకు 10 రూపాయల నోట్లు ఎవరూ చూడకుండా జారవిడిచాడు. ఇంకొకడు గార్డు దగ్గరకొచ్చి.. తుమ్హారా పైసా గిర్‌గయా అంటూ చెప్పడంతో అతడు కంగారుగా వాహనం ముందువైపుకు వెళ్లి నోట్లను ఏరే క్రమంలో నిమగ్నమయ్యాడు.

అదే అదనుగా మరొకడు వాహనం డోర్ తెరిచి ఓ పెట్టెను కిందకు దింపాడు. దాన్ని అలాగే ఎత్తుకుని రోడ్డుకు అవతలివైపు చేరాడు. మిగతా ఇద్దరు కూడా క్షణాల్లో అక్కడి నుంచి మాయమై అటువైపు వెళ్లారు. అప్పటికే అక్కడ ఎల్బీనగర్ వైపు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న షేరింగ్ ఆటోలో సాధారణ ప్యాసింజర్ల లాగా వెళ్లిపోవడం గమనార్హం. అయితే చోరీ జరిగిన వెంటనే 70 లక్షల రూపాయలు దొంగలు ఎత్తుకెళ్లారనే ప్రచారం జరిగింది. తీరా లెక్కలు చూసిన తర్వాత చోరీ సొత్తు 58 లక్షలుగా గుర్తించారు.

షేరింగ్ ఆటోలో మాయం

షేరింగ్ ఆటోలో మాయం

వాహనం ముందువైపు దొంగలు పడేసిన నోట్లను ఏరుతూ.. ఇదంతా గమనించలేకపోయాడు సెక్యూరిటీ గార్డు. ఏటీఎంలో డబ్బులు పెట్టడానికి వెళ్లి తిరిగొచ్చిన సిబ్బంది ఓ పెట్టె కనిపించడం లేదనడంతో అంతా షాక్ తిన్నారు. వెంటనే వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఎల్బీనగర్ లో షేరింగ్ ఆటో దిగిన తర్వాత దిల్‌సుఖ్‌నగర్‌వైపు వెళ్లిపోయినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

క్షణాల్లో పరారీ.. పోలీసులకు సవాల్..!

క్షణాల్లో పరారీ.. పోలీసులకు సవాల్..!

అదలావుంటే చాకచక్యంగా వ్యవహరించి క్షణాల్లో 58 లక్షలు కొట్టేసిన దొంగలకు సంబంధించి రాచకొండ పోలీసులు కీలకాధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అంత పకడ్బందీగా దొంగతనానికి పాల్పడ్డారంటే.. చోరీల్లో ఆరితేరిన అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులు కావొచ్చని భావిస్తున్నారు. చోరీ జరిగిన తీరు చూస్తే పక్కాగా రెక్కీ చేసిన తర్వాతే దొంగతనానికి సిద్ధమైనట్లుగా అర్థమవుతోంది.

ఏటీఎంలో నగదు జమ చేసే సిబ్బంది ఏయే రోజుల్లో వస్తారో.. ఏ సమయంలో వస్తారో పూర్తిగా చూసుకున్న తర్వాతే ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే వాళ్లు రావడానికి ముందే దాదాపు గంట, రెండు గంటల నుంచి దొంగలు అక్కడే తచ్చాడినట్లు తెలుస్తోంది. చోరీకి ముందు మాత్రం అక్కడే ఉన్న ఓ రెస్టారెంట్ లో టిఫిన్లు చేసి ఛాయ్ తాగుతూ కాలక్షేపం చేసినట్లు సమాచారం. మొత్తానికి ఆ వాహనం వచ్చి రాగానే తమ చోరీ ప్లాన్ అమలు చేసినట్లు స్పష్టమవుతోంది. వాహనం సమకూర్చుకుని దొంగతనానికి పాల్పడితే ఈజీగా దొరికిపోతామనే కారణంగా షేరింగ్ ఆటోలో ప్రయాణించడం కొసమెరుపు.

English summary
Hyderabad's Vanasthalipuram ATM cash box theft hot topic in telangana state. The Thieves diverted security guard and left with 58 lakh rupees cash box. Rachakonda police were very serious on this issue, they got key points in this theft case. The Higher Officials appointed special investigation teams to hit this theft case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X