తప్పు చేయకుంటే దొంగతనంగా ఎందుకు వచ్చారు: వీసీకి రోహిత్ తల్లి రాధిక ప్రశ్న
హైదరాబాద్: ఏ తప్పు కూడా చేయకపోతే తన కుమారుడు చనిపోయిన తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సియు) వీసీ అప్పారావు తమను దొంగతనంగా కలిసేందుకు ఎందుకు ప్రయత్నించారో చెప్పాలని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ తల్లి వేముల రాధిక ప్రశ్నించారు.
అప్పారావు స్వయంగా వచ్చి తన కుమారుడు చేసిన తప్పేమిటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రోహిత్ చనిపోయిన తర్వాత తమ ఇంటికి వచ్చి అప్పారావు తమతో మాట్లాడేందుకు ప్రయత్నించారని ఆమె చెప్పారు.
తన కొడుకు (వేముల రోహిత్) ఆశయ సాధనే లక్ష్యమని రోహిత్ తల్లి రాధిక చెప్పారు. మిగతా నలుగురు విద్యార్థుల పైన సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. తన కొడుకు ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
అన్న ఏ లక్ష్యం కోసం చనిపోయారో దాని కోసం విద్యార్థులు చేస్తున్న ఆందోళన చూసి గర్వపడుతున్నాని రోహిత్ తమ్ముడు వేముల రాజా చెప్పాడు. తమ కులంపై లేనిపోని రాజకీయాలు చేస్తున్నారని, ఎస్సీలమని అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని రోహిత్ సోదరుడు స్పష్టం చేశాడు.
మిగిలిన నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ గురువారం మధ్యాహ్నం విశ్వవిద్యాలయం కార్యనిర్వాక మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.