మోడీ మిషన్ నడుస్తోంది, ఆరో పెద్ద దేశంగా భారత్: ప్రజలు మారాలన్న వెంకయ్య
ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో మిషన్ మోడీ నడుస్తోందని అన్నారు. ఆయన శనివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ప్రజల వ్రవర్తనలో మార్పుతోనే దేశం మారుతుందని అన్నారు.
స్వచ్ఛ భారత్తో దేశంలో మార్పు మొదలైందని వెంకయ్యనాయుడు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మోడీ పాపులారిటీ మరింత పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ ఆందోళనలు చేస్తే మోడీ గ్రాఫ్ మరింత పెరుగుతోందని అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ట్విట్టర్ ఫాలోవర్లలో మోడీ అగ్రస్థానంలో ఉన్నారని చెప్పారు.
అంతేగాక, మోడీ నాయకత్వంలో ప్రపంచంలో ఆరో పెద్ద దేశంగా భారత్ అవతరించిందని చెప్పారు. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 360 సీట్లు వస్తాయని సర్వేలు కూడా చెబుతున్నాయని అన్నారు. బిజెపి కొందరిది కాదని, అందరిదని అన్నారు.
మోడీ పిలుపు మేరకు దేశంలో కోటి 40లక్షల మంది స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారని, దీంతో మరింతమంది పేద ప్రజలకు ఈ సబ్సిడీ లభించిందని వెంకయ్య చెప్పారు. మోడీ స్వయంగా ఖాదీపై ప్రచారం మొదలు పెట్టారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.