పండుగకు బట్టలు పంచితే అభివృద్ధి జరిగినట్లా: కెసిఆర్పై విహెచ్ ఫైర్
హైదరాబాద్/ ఖమ్మం: గ్రేటర్ హైదరాబాదులో బట్టలు పంచగానే అభివృద్ధి జరిగినట్లా అని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ప్రశ్నించారు. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసమే అధికార టీఆర్ఎస్ పార్టీ సెటిలర్లకు టికెట్లు ఇస్తామంటోందని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉండేవారో తెలుసుకోవాలని ఆయన గురువారం మీడియాతో అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి హిందువుల పండుగలు కనిపించటం లేదని, మంత్రి కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాతున్నారని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చకుంటే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెసు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల గిరిజనుల గ్రామాలు ముంపునకు గురవుతాయని ఆయన అన్నారు.
గురువారం ఖమ్మం జిల్లా భద్రాచలంలో సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు వల్ల రామాలయం మునగదని కేంద్ర, రాష్ర్టప్రభుత్వాలు భరోసా ఇస్తాయా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం డిజైన్ మార్చాలని కోరుతూ తాము జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు.