కెసిఆర్ 'దిక్కుమాలిన' వ్యాఖ్యపై విహెచ్ ఆగ్రహం, పద్ధతి మార్చుకోవాలి
హైదరాబాద్: దిక్కుమాలిన సమ్మెలు అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలు దళితులను అవమానించేలా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ఆదివారం మండిపడ్డారు.
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని టిఆర్ఎస్ చెప్పడం విడ్డూరమన్నారు. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ధీటుగా ఎదుర్కొంటామన్నారు. పారిశుద్ధ్య కార్మికుల్లో ఎక్కువ మంది దళితులేనని, కెసిఆర్ తన వ్యాఖ్యలతో వారిని అవమానించారన్నారు.
వారి సమస్యలను తీర్చాల్సిన ముఖ్యమంత్రే దిక్కుమాలిన సమ్మె అంటే ఎలా అన్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి మొక్కినట్టు విహెచ్ తెలిపారు.

ఆయన ఆదివారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని కూడా అమ్మకు మొక్కినట్టు చెప్పారు. టీఆర్ఎస్కు అధికారం ఇచ్చి తప్పు చేసినట్టు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్నారు.
కాగా, దిక్కుమాలిన సమ్మె చేస్తున్న విపక్షాలకు తగిన శాస్తి జరిగిందని, కార్మికులను రెచ్చగొట్టి దిక్కుమాలిన సమ్మె చేస్తున్నారని, ఇక అరెస్టు చేయక ఏం చేయాలని కరీంనగర్ జిల్లాలో శనివారం మండిపడ్డారు. ఇక మీ పప్పులు ఉడకవని, భయపడే ప్రభుత్వం లేదని హెచ్చరిస్తున్నానని చెప్పారు. మీ సమ్మె వల్ల వెయ్యిమంది కార్మికుల ఉద్యోగాలు పోయాయన్నారు.
దీనిపై వామపక్షాలు మండిపడ్డాయి. కెసిఆర్ తీరు మార్చుకోకుంటే ప్రజలు బుద్ధి చెబుతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. దిగజారుడు వ్యాఖ్యలు చేసిన కెసిఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రులు
లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మహంకాళి అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.
దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.












Click it and Unblock the Notifications