తెరాస ఓవర్లోడ్: టిడిపి నాయకులకు విహెచ్ బంపర్ ఆఫర్
హైదరాబాద్: తెలుగుదేశం తెలంగాణ నాయకులకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడానికి బదులు కాంగ్రెస్లో చేరాలని పిలుపునిచ్చారు.
టిడిపి నుంచి తెరాసలోకి వలసపోయి ఆ పార్టీ మీద లోడ్ పెంచుతున్నారనిస అక్కడ కూర్చునేందుకు కుర్చీ లేకపోయినా గుంపులు గుంపులుగా వెళ్లడం వల్ల ప్రయోజనం ఏమిటని అన్నారు. అలా కాకుండా వారంతా కాంగ్రెస్లో వచ్చి చేరాలని, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు భవిష్యత్తు ఉందని, కలిసి పని చేసి 2019 ఎన్నికల్లో విజయబావుటా ఎగరేద్దామని ఆయన అన్నారు.

శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ టిడిపి నుంచి వలసలు పోవడం వల్ల తెరాసలో మొదటి నుంచి ఉన్నవాళ్లు ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కువ మంది వెళ్లి ఒకే పార్టీలో చేరినా పదవుల పంపకం సమయంలో నిరాశ చెందాల్సి వస్తుందని అన్నారు.
కాంగ్రె స్లో స్వేచ్ఛగా ఉండవచ్చునని, కష్టపడ్డ వాళ్లకు అవకాశం దక్కుతుందని విహెచ్ అన్నారు.
2019 నాటికి పరిస్థితులు మారిపోతాయని, కాంగ్రెసుకు మంచి రోజులు వస్తాయని, తెరాసను ఓవర్ లోడ్ చేసి ఎన్నికల సమయంలో అవకాశాలు రాక భంగపడే బదులు కాంగ్రెస్ను నమ్ముకోవడం మేలని ఆయన అన్నారు. ఒక బీసీ వ్యక్తి గ్రేటర్ మేయర్ పీఠాన్ని అధిరోహించడం హర్షణీయమని వీహెచ్ అభినందించారు.












Click it and Unblock the Notifications