కేసీఆర్ ఇచ్చే డబ్బుపై విజయశాంతి, నా పేరు చెడగొట్టాడు, నా తమ్ముడ్ని ఓడించండి: అరుణ
మహబూబ్ నగర్: టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు వద్ద చాలా డబ్బు ఉందని, వాటితో ఓట్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. వారు ఇచ్చే డబ్బును తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.
దొరల పాలనను అంతమొందించండి
కేసీఆర్ ఈ నాలుగున్నరేళ్లలో చేసింది ఏమీ లేదని విజయశాంతి అన్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకొంటూ పోతుంటే మహిళలు ఎలా నెట్టుకు వస్తారని విజయశాంతి ప్రశ్నించారు. తెలంగాణలో దొరల పాలనను అంతమొందించి కాంగ్రెస్కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈసారి కేసీఆర్ మాటలను నమ్మేస్థితిలో ప్రజలు లేరని చెప్పారు. కేసీఆర్ తన పాలనలో పాలమూరుకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.
డిజైన్ల మార్పుతో దోపిడీ
పాలమూరులోని నెట్టెంపాడు, కోయిలసాగర్, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులలో తొంబై అయిదు శాతం పనులు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. మిగతా ఐదు శాతం పనులు కూడా సరిగా చేయకుండానే నీళ్లు తామే తీసుకొచ్చామని చెప్పడం విడ్డూరమన్నారు. ఏ ప్రాజెక్టులను నింపలేదన్నారు. ప్రాజక్టుల డిజైన్ల మార్పు పేరుతో దోచుకుంటున్నారన్నారు.
తమ్ముడు చిట్టెం నర్సిరెడ్డిపై ఆగ్రహం
తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ఆశయాలతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తన తమ్ముడు చిట్టెం రామ్మోహన్ రెడ్డిని గెలిపిస్తే, అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరానని చెబుతున్నాడని, తాను మంత్రిగా ఉన్నప్పుడే భీమా, సంగంబండ జలాశయాలకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని డీకే అరుణ గుర్తు చేశారు.
నా పేరు చెడగొడుతున్నావ్, మా తమ్ముడిని ఓడించండి
తన సోదరుడు చిట్టెంను ఉద్దేశించి డీకే అరుణ మాట్లాడుతూ... నాయన ఆత్మ ఘోషిస్తోంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నావు, నా పేరు చెడగొడుతున్నావు అంటూ ఆమె మండిపడ్డారు. కుటుంబానికి మచ్చ తెచ్చావంటూ ధ్వజమెత్తారు. నర్సిరెడ్డి కొడుకని గెలిపిస్తే నాన్న పేరును మంటగలిపావన్నారు. మక్తల్లో ఎవరికి టికెట్టు ఇచ్చినా చిట్టెం రామ్మోహన్ రెడ్డిని ఓడించి పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు.