టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చెప్పులు విసిరిన జనం..
జిల్లాలోని జఫర్ ఘర్, స్టేషన్ పూర్,చిల్పూర్ మండలాలను జనగాం జిల్లాలో కలపడం పట్ల అక్కడి ప్రజలు ఎమ్మెల్యేపై తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.
జనగాం: తెలంగాణలో జిల్లాల పునర్విభజన మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. జిల్లాలోని జఫర్ ఘర్, స్టేషన్ పూర్,చిల్పూర్ మండలాలను జనగాం జిల్లాలో కలపడం పట్ల అక్కడి ప్రజలు ఎమ్మెల్యేపై తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.
తాజాగా అంబేడ్కర్ 60వ వర్దంతిని పురస్కరించుకుని జఫర్ఘర్ లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించడానికి వెళ్లారు రాజయ్య. ఎమ్మెల్యే గ్రామానికి వచ్చాడన్న విషయం తెలుసుకున్న స్థానిక మహిళలు.. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని తమ గ్రామాలను జనగాం జిల్లాలో కలపడం పట్ల ఎమ్మెల్యేను నిలదీశారు.
ఈ క్రమంలోనే.. తమ గ్రామాన్ని విడిచిపోవాల్సిందిగా రాజయ్యపై పలువురు మహిళలు చెప్పులు విసరడం గమనార్హం. ఈ అనూహ్య ఘటనకు రాజయ్య షాక్ తిన్నట్టుగా తెలుస్తోంది. మంగళవారం నాడు ఈ ఘటన జరగ్గా.. అంతకు రెండువారాల ముందు కూడా ఇలాంటి ప్రతిఘటనే రాజయ్యకు ఎదురైంది.
నవంబర్ 24న రాజయ్య కాన్వాయ్ తిడుగు గ్రామం మీదుగా వెళ్తున్న సమయంలో.. అక్కడి స్థానికులు ఆయన కారుపై రాళ్లు రువ్వారు. ప్రస్తుతం అక్కడి మూడు మండలాల ప్రజలు తమ గ్రామాలను తిరిగి వరంగల్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం జాయింట్ యాక్షన్ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజయ్యపై దాడులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.