అమానుషం: క్షయతో మహిళ మృతి, గ్రామంలోకి తీసుకురానివ్వలేదు
క్షయతో బాధపడుతూ మరణించిన ఓ మహిళ మృతదేహాన్ని తమ గ్రామంలోకి తీసుకురానివ్వలేదు గ్రామస్తులు.
పెద్దపల్లి: శాస్త్ర, సాంకేతికంగా పురోగమిస్తున్న ఈ కాలంలోనూ మనుషులు మారలేదా? ఈ చిత్రంలోని మృతదేహం.. దాని చుట్టూ విషణ్న వదనాలతో నిల్చున్న వీరే అందుకు సజీవ..కాదు కాదు.. నిర్జీవ సాక్ష్యం. అమానుషం.. అమానవీయం.. అన్న పదాలతో పోల్చలేని శిక్షకు గురై.. మేమేం పాపం చేశాం? అని ప్రశ్నిస్తున్న వీరికి సమాధానం చెప్పేదెవరు?.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మడిపెల్లికి చెందిన ఈర లక్ష్మి, రాజలింగు దంపతులు బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం కరీంనగర్ వెళ్లారు. తర్వాత సుల్తానాబాద్ మండలం పూసాల అనుబంధ గ్రామం శాస్త్రీనగర్కు వలసొచ్చారు. వారికి నలుగురు సంతానం. లక్ష్మి కొన్నేళ్లుగా క్షయ వ్యాధితో బాధపడుతోంది. ఆరోగ్యం విషమించడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది.
కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామం మడిపెల్లికి తరలించారు. ఆమె క్షయవ్యాధితో మృతిచెందిందని తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహాన్ని గ్రామంలోకి రానివ్వలేదు. ఎంత బతిమాలినా..గ్రామస్థుల మనసు కరగకపోవడంతో.. కుటుంబసభ్యులు ఆదివారం అర్ధరాత్రి మృతదేహాన్ని సుల్తానాబాద్ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. మృతదేహంతోపాటు..రాత్రంతా చలిలోనే గడిపారు. సుల్తానాబాద్ వాసుల సాయంతో సోమవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు.
యువతి ఆత్మహత్య
వరంగల్ నగరంలోని 32వ డివిజన్ న్యూశాయంపేటకు చెందిన సత్తు శ్వేతా సోని(22) సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని మృతి చెందింది. తండ్రి సత్తు సారంగపాణి కథనం ప్రకారం.. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గతేడాది పెద్ద కూతురు వివాహం చేశారు. రెండో కుమార్తె శ్వేతా సోని గతేడాది ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం వేచి చూస్తోంది.
తల్లిదండ్రులు సుభాష్ విగ్రహం సమీపంలో కిరాణం షాపు నడుపుతుంటారు. ఇటీవల ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూశారు. తల్లిదండ్రులు ఎప్పటిలాగే కిరాణం దుకాణానికి సోమవారం ఉదయం 7 గంటలకే వెళ్లిపోయారు. ఇంట్లో అందరితో కలివిడిగా ఉంటు అప్యాయంగా ఉండే సోని ఆత్మహత్య చేసుకున్నారని తెలియడంతో ఆ కుటుంబ సభ్యులు దు:ఖసాగరంలో మునిగిపోయారు.
తాను ఇంత చదువు చదివి ఉద్యోగంలేక పెళ్లి చేసుకోవాలా? అనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తండ్రి సారంగపాణి పోలీసులకు వివరించారు. సుబేదారి సబ్ ఇన్స్పెక్టర్ ఎ.శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.