గుట్టలు కరిగిపోతున్నాయి: వందల కోట్ల బాకీలతో కోర్టుల బాటలో పంచాయతీలు
కళ్ల ముందే పల్లెలకు కొండంత అండల్లా ఉన్న గుట్టలు కరిగిపోతున్నాయి.. వాటితో వ్యాపారం చేసే వ్యాపారులు... రాయల్టీ రూపంలో ప్రభుత్వం రూ.కోట్లు మూటగట్టుకుంటున్నాయి. అడ్డుకోలేని నిస్సహాయత ప్రజలది.
కరీంనగర్: కళ్ల ముందే పల్లెలకు కొండంత అండల్లా ఉన్న గుట్టలు కరిగిపోతున్నాయి.. వాటితో వ్యాపారం చేసే వ్యాపారులు... రాయల్టీ రూపంలో ప్రభుత్వం రూ.కోట్లు మూటగట్టుకుంటున్నాయి. అడ్డుకోలేని నిస్సహాయత ప్రజలది.
పంచాయతీల పాలకవర్గాలదీ... సహజ వనరులు కరిగిపోతున్నా సీనరేజీ రూపంలో దక్కే నిధులతో కనీస వసతులు సమకూరుతాయని... ఏళ్లుగా పడుతున్న అవస్థలు తొలుగుతాయని పెట్టుకున్న ఆశలు కలలుగానే మిగిలిపోతున్నాయి. ఏళ్లకు ఏళ్లు ఎదురుచూపులతోనే కాలం గడిచిపోతోంది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఒక్కో పంచాయతీకి రూ.కోట్లలో సీనరేజీ నిధులు రావల్సి ఉంది. విసిగివేసారిన ప్రజలు తమకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కించుకునేందుకు న్యాయస్థానాల బాట పడుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 1207 పంచాయతీలున్నాయి. రెవెన్యూపరంగా జిల్లాలు ఏర్పడినా జిల్లా పరిషత్తు, పంచాయతీలపరంగా ఉమ్మడి జిల్లా వ్యవస్థనే కొనసాగుతోంది.. పంచాయతీలకు సొంత వనరులు చాలా తక్కువ. ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధుల మీదనే అత్యధిక పంచాయతీలు నెట్టుకొస్తున్నాయి. కొన్ని గ్రామాల పరిధిలో మాత్రం ఇసుక, కంకర, గ్రానైట్ క్వారీలు, రైస్మిల్లులు, ఇతర చిరు పరిశ్రమలు ఉన్నాయి.
రైస్ మిల్లులు, చిరు పరిశ్రమల నేరుగా పంచాయతీలకే పన్నులు చెల్లిస్తుంటాయి. క్వారీలు ఉన్న పంచాయతీలకు భారీగా ఆదాయం ఉంటుంది. ఈ లెక్కన ఈ గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెట్టాలి. ఆచరణలో మాత్రం అది సాధ్యం కావడం లేదు. ఆదాయం కాగితాలకే పరిమితమవుతోంది.. ఇందుకు కారణం ప్రభుత్వం కావడం
ఇసుక, కంకర, గ్రానైట్, ఇతర ఖనిజ వనరులకు సంబంధించిన క్వారీలు ఉంటేసీసీ రోడ్లకు, మురుగు కాల్వలకు నోచుకోని ఈ వీధులు రామడుగు మండలం వెదిరలోనివి. ఈ గ్రామం పరిధిలో ఆరు గ్రానైట్ క్వారీలున్నాయి. సీనరేజీ రూపంలో గ్రామానికి రూ.6 లక్షలపైనే నిధులు రావాలి. అవి రాకపోవడంతో పనులు చేసుకునే పరిస్థితి లేకుండాపోయింది.

రాని నిధులు..
అక్కడ తీసుకున్న ఆయా వనరు పరిమాణం ఆధారంగా వాటిని తీసుకున్న వారు ప్రభుత్వానికి నిర్దేశించిన రీతిలో రాయాల్టీ చెల్లిస్తారు. ప్రభుత్వం ఆ మొత్తాన్ని జడ్పీ, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీలకు 25:50:25 దామాషాలో నిధులు పంచాలి. వాస్తవానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ నిధులు విడుదల చేయాలి. కానీ గత నాలుగేళ్లుగా ప్రభుత్వం వీటిని విడుదల చేయడం లేదు. ఉమ్మడి జిల్లాలోని 125 పంచాయతీల పరిధిలో వివిధ రకాలైన క్వారీలున్నాయి. వీటికి సంబంధించి 2014-15 నుంచి 2017-18 మొదటి మూడు నెలల వరకు ఉమ్మడి జిల్లాకు సీనరేజీ రూపంలో రూ.459.91 కోట్లు రావాలి. ఇందులో 2015-16 సంవత్సరానికి సంబంధించి మొదటి, రెండు మూడు నెలల కాలానికి రూ.5.62 కోట్లు, 2016-17 సంవత్సరం మొదటి మూడు నెలల కాలానికి సంబంధించి రూ.1.24 కోట్లు మొత్తంగా రూ.6.84 కోట్లు మాత్రం విదిల్చారు.. ఇంకా రూ.453.07 కోట్లు సీనరేజీ రూపంలో పల్లెలకు దక్కాల్సి ఉంది.

ఆ నిధులొస్తే...
ప్రభుత్వం నుంచి వచ్చే రూ.453.07 కోట్లు దక్కితే పల్లెల్లో అభివృద్ధి పనులు జోరందుకునే అవకాశం ఉంది. ఈ 453.07 కోట్లలో మండల పరిషత్తులకు రూ.226.53 కోట్లు, జడ్పీకి రూ.113.26 కోట్లు. పల్లెలకు నేరుగా రూ.113.26 కోట్లు దక్కుతాయి.. గ్రామాలు, మండల పరిషత్తు, జడ్పీ వచ్చే వాటాల నిధులన్నీ పల్లెల్లోనే ఖర్చు చేస్తారు. ఈ నిధులతో గ్రామాల్లో రహదారులు, మురుగు కాలువలు, పాఠశాల భవనాలు, ఉద్యానవనాలు, సామాజిక భవనాల నిర్మాణాలు, స్థానికంగా ఉండే ఇతర అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది..

గుట్టలు కనుమరుగవుతున్నా...
తమ పంచాయతీ పరిధిలోని గుట్టలు కనుమరుగవుతున్నా న్యాయంగా దక్కాల్సిన సీనరేజీ నిధులు దక్కకపోవడంతో గంగాధర మండలం గట్టుభూత్కూర్, సర్వారెడ్డిపల్లి, ఆశంపల్లి సర్పంచులు, వార్డు సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో గట్టు భూత్కూర్కు రావల్సిన రూ.4.65 కోట్లు దక్కాయి. వీటితో ఇప్పుడు అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నారు. ఆశంపల్లికి రూ.3.50 కోట్లు, సర్వారెడ్డిపల్లికి రూ.36 కోట్లు జమ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది.. ఈ నిధులు త్వరలోనే జమ అయ్యే అవకాశం ఉంది.. గంగాధర మండలానికి రావల్సిన సీనరేజీ నిధులు రూ.175 కోట్లు చెల్లించాలని ఎమ్పీటీసీ సభ్యులు కోర్టును ఆశ్రయించారు.

అభివృద్ధి కుంటుపడుతోంది...
సీనరేజీ నిధులకు సంబంధించి మైనింగ్, పంచాయతీ, జడ్పీకి సంబంధం ఉంది.. రాయాల్టీ రూపంలో గనుల శాఖ నుంచే నిధులు ప్రభుత్వ ఖజానాకు సొమ్ము చేరుతుంది. జడ్పీ, పంచాయతీలు వాటిని రాబట్టేందుకు కృషి చేయాల్సి ఉంది.. మైనింగ్ అధికారులు క్వారీయింగ్తోనే చేతులు దులుపుకొంటున్నారు. జడ్పీ, పంచాయతీ పాలకవర్గాల్లో అత్యధికం అధికార పార్టీ చేతుల్లో ఉండడంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తే స్థానిక శాసనసభ్యులు, మంత్రుల కన్నెర్రకు గురవుతామనే భయంతో పాలకవర్గాలు మిన్నుకుండిపోతున్నాయి. ఫలితంగా పల్లెలకు దక్కాల్సిన సొమ్ము దక్కకుండాపోయి అభివృద్ధి కుంటుపడుతోంది.












Click it and Unblock the Notifications