భాగ్యనగరంలో గణేశ ఉత్సవాల వేళ ఏఐ డ్రోన్స్ తో పోలీసుల ఆకాశ నిఘా!
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగానూ వాడవాడలా వినాయక విగ్రహ ప్రతిష్టలు జరిపి పూజలు చేస్తున్నారు. హైదరాబాద్లో అత్యంత ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తారు. ఈ వినాయక చవితి వేడుకలు, నవరాత్రులు నిర్విఘ్నంగా కొనసాగాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
గణేశ శోభాయాత్రలు, నిమజ్జనాల సమయంలో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. ఏఐ ఆధారిత డ్రోన్లు ఆకాశం నుంచి నిఘా నిర్వహించనున్నాయి. టీజీ క్వెస్ట్ అనే ఏఐ ఇంటిగ్రేటెడ్ పోలీసింగ్ వ్యవస్థలో భాగంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా ఈ సాంకేతికతను ఉపయోగించనున్నారు.

సుమారు ఐదు వేల సీసీటీవీ కెమెరాలతో పాటు ఏఐ డ్రోన్లు రంగంలోకి దించి రియల్ టైమ్లో జనసందోహం, ట్రాఫిక్, సున్నిత ప్రాంతాలను పర్యవేక్షిస్తారు. పెద్ద పండాలు, ప్రధాన రహదారులు, నిమజ్జన కేంద్రాల వద్ద ప్రత్యేక దృష్టి పెడతారు. ఏ చిన్న అలజడి జరిగినా వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేలా అన్ని విధాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
భాగ్య నగరంలో ఈ ఏడాది పదిహేను వేలకు పైగా గణేశ్ విగ్రహాలు ఏర్పాటు కావచ్చని అంచనా. వినాయక విగ్రహాల నిమజ్జనాలకు ఇరవై ఏడు ప్రాంతాలను గుర్తించారు. భద్రత కోసం ఐదు వేలకు పైగా పోలీసు సిబ్బంది, వెయ్యికి పైగా ట్రాఫిక్ సిబ్బందిని మోహరిస్తున్నారు. పెద్ద పండాల నిర్వాహకులు స్వయంగా సర్వైలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కూడా పోలీసులు సూచించారు.
అంతేకాదు ఎక్కడా ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా కూడా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. డ్రోన్లు ఆకాశం నుంచి విస్తృత ప్రాంతాన్ని కవర్ చేస్తూ, ఆ ప్రాంతంలోని వినాయక మండపాల వద్ద పరిస్థితిని లైవ్ వీడియోలతో కంట్రోల్ రూమ్కు పంపుతాయి. దీని వల్ల సాంప్రదాయ గస్తీతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో అదనపు భద్రత లభిస్తుంది. ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరగాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకుని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయం తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications
