విష జ్వరాలతో అట్టుడుకుతున్న ఆదిలాబాద్: మురికి కూపాలుగా గ్రామాలు
ఊరూవాడా తేడా లేకుండా విషజ్వరాలు(వైరల్ ఫీవర్స్) విజృంభిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వ్యాపిస్తున్నాయి.
అదిలాబాద్: ఊరూవాడా తేడా లేకుండా విషజ్వరాలు(వైరల్ ఫీవర్స్) విజృంభిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎక్కువగా వ్యాపిస్తున్నాయి.
కొన్నిరోజులుగా నెలకొన్న వాతావరణ మార్పులతో చిన్నాపెద్దా తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా వేలాది మంది వీటి బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు.
ఈ ఏడాది మలేరియా తగ్గుముఖం పట్టినా జ్వరాలు మాత్రం ప్రతాపం చూపుతున్నాయి. రోజు కూలీ చేసుకొని కుటుంబాలను పోషించుకునే కుటుంబాలు వీటి బారిన పడి సతమతమవుతున్నాయి. కుటుంబాలను పోషించుకోవడానికే ఇబ్బందుల పాలయ్యేవారు చికిత్స కోసం అప్పుల పాలుకావాల్సి వస్తోంది. వ్యాధులు ప్రబలటానికి పరిశుభ్రతలోపం కూడా కారణంగా మారింది.
ఇప్పటివరకు
వర్షాలు
ఒక
మోస్తరుగా
కురిసి
ప్రస్తుతం
ఎండలు
కాస్తుండటంతో
మురుగు
ప్రాంతాల్లో
దోమలు
వృద్ధి
చెంది
వీటికి
కారణంగా
మారుతున్నాయి.
జిల్లాను
అట్టుడికిస్తున్న
విషజ్వరాలు
అన్ని
ప్రాంతాలకు
విస్తరిస్తున్నాయి.
గిరిజన, మైదాన ప్రాంతాల్లో కూడా వీటి జోరు ఎక్కువగా ఉంది. ప్రధానంగా గిరిజన ప్రాంతాలైన నేరడిగొండ, ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, సిర్పూర్(యు) తదితర ప్రాంతాల్లో విష జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సైతం బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గ్రామాల్లో పలువురు ఆర్ఎంపీ వైద్యుల వద్ద చికిత్సలు పొందుతుండటంతో ఇవి లెక్కల్లోకి రావడం లేదు. ఇటీవల ఇచ్చోడ మండలం అడెగామ(బి)లో దాదాపు 60 మందికి పైగా విషజ్వరాల బారిన పడ్డారు.
కనిపించని పారిశుద్ధ్యం
గత అనుభవాల మేరకు ఈ సారి వ్యాధుల నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు చేసిన ప్రకటనలు ఆచరణలో కనిపించడం లేదు. వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖల సమన్వయలోపం కారణంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సైతం పలు చోట్ల అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. తద్వారా ఈగలు, దోమలు వృద్ది చెంది అంటు వ్యాధులకు కారణంగా మారుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోనూ మురికినీటి గుంతల్లో, కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లటం, ఇతర నివారణ మార్గాలు చేపట్టటం విస్మరించారు. పట్టణంలోనే ఈ పరిస్థితి ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటుందో వూహించుకోవచ్చు.
పెరుగుతున్న జ్వర పీడితుల సంఖ్య
జిల్లాలో జ్వరబాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఐదు నెలలుగా వివరాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది. ఇవి కేవలం ప్రభుత్వం ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వివరాలు మాత్రమే. ఇంకా ప్రైవేటు ఆసుపత్రుల్లో, ఆర్ఎంపీ వైద్యుల వద్ద వైద్యం పొందిన వారిని కలుపుకొంటే ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
వారం రోజులుగా జ్వరం
ఈ వ్యక్తి నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన మొహ్మద్ రఫీ. గత వారం రోజులుగా తీవ్ర జ్వరంతో పాటు చలి, ఒళ్లు నొప్పులు, కడుపులో నొప్పితో బాధపడుతూ స్థానికంగా వైద్యం చేయించుకున్నారు. అయినా వ్యాధి నయం కాకపోవడంతో గురువారం రిమ్స్లో చేరారు. పరీక్షలన్నీ చేయించుకున్నాడు. ఇతనికి విషజ్వరం ఉందని నిర్ధారించిన వైద్యులు ఈ మేరకు చికిత్సలు అందిస్తున్నారు. జ్వరం కారణంగా తన కుటుంబ పోషణ కోసం నడిపించే ఆటోను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పనులు మానుకోవాల్సి వచ్చింది
ఈ యువకుడి పేరు బూత రాజు. భీంపూర్ మండలం పిప్పల్కోటికి చెందిన ఈయన వ్యవసాయ పాలేరుగా పని చేస్తుంటారు. మంగళవారం తీవ్ర జ్వరం రాగా వెంటనే అంబులెన్స్లో రిమ్స్కు తరలించారు. జ్వరంతో పాటు ఒళ్లునొప్పులు, తల నొప్పి, కడుపులో నొప్పితో భాధపడుతూ రిమ్స్లో చేరారు. వైద్య పరీక్షలు చేయించాక అంతా సాధారణమేనని తేలింది. కాని జ్వరం మాత్రం తగ్గటం లేదు. ప్రస్తుతం కొంత కోలుకున్నా కూడా నొప్పులు మాత్రం ఇంకా తగ్గలేదు. విషజ్వరం కావటం వల్లనే ఇలా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. జ్వరం కారణంగా ఒక పక్క బాధ, మరో పక్క తన యజమాని వద్ద పనికి ఎగనామం పెట్టినట్లయిందని ఆ యువకుడు బాధపడుతున్నారు.
కొనసాగుతున్న వైద్య శిబిరం
ఇచ్చోడ మండలంలోని అడెగామ(బి) గ్రామంలో కొనసాగుతున్న వైద్య శిబిరం ఇది. ఈ గ్రామంలో మూడు రోజుల క్రితం ఒకే సారి దాదాపు అరవై మందికిపైగా జ్వరాల బారిన పడ్డారు. దాదాపు ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు మంచాన పడ్డారు. దీంతో ఆ గ్రామంలో వైద్య శాఖ వైద్య శిబిరం ఏర్పాటు చేసి కొనసాగిస్తోంది. ఇప్పుడిప్పుడే కొంత వరకు ఆ గ్రామం కోలుకోంటోంది.
బోరుబావి చుట్టూ మురుగు, చెత్త
ఇది పట్టణంలోని శాంతినగర్ కాలనీలోని బోరుబావి. దీని చుట్టు కూడా నీరు నిలిచి మురగు ఏర్పడటంతో పాటు చెత్త కూడా అక్కడ చేరడంతో దుర్వాసనభరితంగా మారింది. దీన్ని తొలగించాల్సిన పురపాలక సంఘం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. దీంతో ఇక్కడ ఈగలు, దోమలు వృద్ధి చెంది వ్యాధులకు కారణంగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు పారిశుద్ధ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదనటానికి ఈ చిత్రమే నిదర్శనం.
వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం: రాజీవ్రాజ్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి
వాతావరణం మార్పుల సమయంలో వైరల్ ఫీవర్లు కొంత పెరిగే అవకాశాలున్నాయి. అయినా కూడా తాము డీప్యుటీ డీఎంహెచ్ఓలను, సిబ్బందిని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు చర్యలు సమీకరించుకుంటూ జిల్లా పాలనాధికారికి సైతం సమాచారం అందిస్తున్నాం. అవసరమైన చోట ప్రత్యేక ఏర్పాట్లు చేసి వైద్య సేవలను విస్తరిస్తున్నాం.