రేవంత్ను కల్సిన కాంగ్రెస్ నేత విష్ణు, ఆ డబ్బు ఎవరో పెట్టి వెళ్లారు!
హైదరాబాద్: చర్లపల్లి జైలులో రిమాండులో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం ఉదయం కలిశారు. ఆయన పరామర్శించేందుకు కలిసినట్లుగా తెలుస్తోంది.
ఆ డబ్బును ఎవరో గదిలో పెట్టి వెళ్లారు!
రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో స్టీపెన్ సన్ నివాసంలో... సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షలు స్టీఫెన్కు అడ్వాన్సుగా ఇచ్చేందుకే తెచ్చారన్నది ఏసీబీ అధికారుల ఆరోపణ. ఈ డబ్బును ఎక్కడినుంచి తెచ్చారని విచారణ సందర్భంగా ప్రశ్నించగా ఆ డబ్బుతో తమకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి చెప్పారు.
సెబాస్టియన్ మాత్రం ఎవరో గదిలో పెట్టి వెళ్లారని, అంతకుమించి తనకేమీ తెలియదని సమాధానం చెప్పారు. ఈ నోట్ల కట్టలపై బ్యాంకు ముద్రలేవీ లేవు. కొన్ని బ్యాంకుల్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేసినా ఎలాంటి ఆధారాలూ లభించలేదని, కాదు లభించాయని వార్తలు వస్తున్నాయి.
ఈ డబ్బును ఎక్కడి నుంచి తెచ్చారో గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరో రూ.4.5 కోట్లు ఇస్తామన్న ప్రస్తావన కూడా ఉండటంతో, ఆ డబ్బు ఎక్కడి నుంచి తేవాలనుకున్నారన్న విషయంపైనా దృష్టి సారించారు. దీన్ని నిగ్గు తేల్చేందుకు కొన్ని ప్రైవేటు బ్యాంకులు, కార్పొరేట్ సంస్థల లావాదేవీలను ఏసీబీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
తాము కొందరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని ఏసీబీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. చంద్రబాబు నాయుడు, మరికొందరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. తమది సమర్థవంతమైన విభాగమని, నిబంధనల ప్రకారమే దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది.