ఓటర్ల జాబితా విడుదల: 'పవన్ కళ్యాణ్ను ఎంపీ కవిత అవమానించారు'
హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను నిజామాబాద్ ఎంపీ కవిత అవమానించారని హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఖైరతాబాద్లో దానం నాగేందర్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజలకు అధికార పార్టీ టీఆర్ఎస్ అరచేతిలో స్వర్గం చూపిస్తోందని ఎద్దేవా చేశారు. బలహీన వర్గాలు అంటే ఎంపీ కవితకు చిన్నచూపు అని ఆయన ఆరోపించారు.
మేకప్ ప్యాకప్ మ్యాన్ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని కవిత అవమానించారని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరానికి పవన్ కళ్యాణ్ సేవలు అవసరమని ఆయన చెప్పారు. కాగా, ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, జానారెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న కవిత "సెటిలర్ల ఓట్ల కోసం బీజేపీ, టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయిస్తారట. తిక్క పవన్కు కేసీఆర్ ఎప్పుడో చుక్కలు చూపించారు. మేకప్తో ప్రచారానికి వచ్చే పవన్ ఎన్నికలు ముగిసిన తరువాత ప్యాకప్ చెప్పి వెళ్లిపోతారు." అని పవన్పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
గ్రేటర్ పరిధిలో ఓటర్ల జాబితా వివరాలు విడుదల
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రేటర్ పరిధిలో ఓటర్ల తుది జాబితాను జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం విడుదల చేశారు.
మొత్తం ఓటర్ల సంఖ్య 74,36,247గా ఉంది. కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకున్న వారి సంఖ్య 3,83,530. 24 మంది ఐఏఎస్ అధికారులకు జీహెచ్ఎంసీ ఎన్నికలకు పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. అభ్యర్థుల ఖర్చు పరిశీలనకు మరో 20 మంది అధికారులను నియమించింది.
గ్రేటర్ పరిధిలో ఓటర్ల సంఖ్య - 74,36,247
కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య - 3,83,530
జాబితా నుంచి తొలగించిన ఓట్లు - 15,217
మార్పులు, చేర్పులు జరిగినవి - 41,011 ఓట్లు.












Click it and Unblock the Notifications