జనగామలో మంత్రి ఎర్రబెల్లికి నిరసన సెగ; వీఆర్ఏల ఆందోళనతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు చేపట్టిన నిరసన దీక్షలు నాలుగో రోజుకు చేరిన విషయం తెలిసిందే. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు జిల్లా కలెక్టరేట్ లను ముట్టడించిన వీఆర్ఏలు పే స్కేల్ తో పాటుగా 55 సంవత్సరాల వయసున్న వీఆర్ఏ ల వారసులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తాజాగా జనగామ జిల్లాలోని కలెక్టరేట్ వద్ద వీఆర్ఏ ల ఆందోళన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల విషయంలో వీఆర్ఏ ల ను ఉద్దేశించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తాగి పడేసిన మద్యం సీసాలను గ్రామ పంచాయతీ సిబ్బంది సేకరించి వాటిని అమ్మి వచ్చిన డబ్బులను అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై వీఆర్ఏలు మండిపడుతున్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నేడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును వీఆర్ఏలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామకు వచ్చిన క్రమంలో ఆయనను వీఆర్ఏలు జనగాం జిల్లా కలెక్టరేట్ వద్ద అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అంతే కాదు వీఆర్ఏలు కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్ళడం కోసం ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను లోనికి వెళ్లకుండా కట్టడి చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలపై వీఆర్ఏలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులకు వీఆర్ఏలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు, తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని వీఆర్ఏలు హెచ్చరిస్తున్నారు. ఆందోళనలు, రిలే దీక్షలతో ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. నిరసనకారులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఎర్రబెల్లి దయాకర్ రావుకు చేదు అనుభవం ఎదురైనట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications