వరంగల్ ఉప ఎన్నిక: ప్రతిపక్షాల అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు
వరంగల్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అభ్యర్థి పసునూరి దయాకర్ 4 లక్షల 59 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించి ప్రతిపక్షాలను చావు దెబ్బ తీశారు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండులోనూ దయాకర్ మెజారిటీని పెంచుకుంటూ వచ్చారు.
కాంగ్రెసు పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు లక్షా 56 వేల 315 ఓట్లు రాగా, టిడిపి - బిజెపి కూటమి అభ్యర్థి పగిడిపాటి దేవయ్యకు లక్షా 30 వేల 178 ఓట్లు పోలయ్యాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్కు 23 వేల 325 ఓట్లు వచ్చాయి. ఇతరులకు 28,541 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 7,753 ఓట్లు పడ్డాయి. మొత్తం 22 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.
మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన కేసీఆర్కు 3,97,029 మెజార్టీ వచ్చింది. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు 60 శాతం ఓట్లు పడగా, కాంగ్రెస్ 15, బీజేపీకి 12 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కలేదు.
వరంగల్ లోక్సభ ఉపఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. వరంగల్ లోక్సభ ఉపఎన్నిక స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా సర్వే పోటీచేసిన విషయం తెలిసిందే.