గుంటూర్లో వరంగల్ విద్యార్థిని ఆత్మహత్య: ఇద్దరు సీనియర్ల సస్పెన్షన్
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థిని రిషికేశ్వరి ఘటన పైన శ్రీనివాస్, జయచరణ్లను విశ్వవిద్యాలయం సస్పెండ్ చేసింది. చరణ్, శ్రీనివాస్లతో ఫోన్లో మాట్లాడాలని అనీష అనే విద్యార్థిని ఒత్తిడి తెచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
దీంతో, విశ్వవిద్యాలయ అధికారులు వారిద్దరి పైన చర్యలు తీసుకున్నారు. కాగా, విద్యార్థులు నేరం చేయలేదని నిరూపించుకుంటే కళాశాలకు రావొచ్చునని సూచించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు, ర్యాగింగ్కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన బిఆర్క్ విద్యార్థిని రిషికేశ్వరి రెండు రోజుల క్రితం చనిపోయిన విషయం తెలిసిందే. రిషికేశ్వరి మృతితో వారి కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది.
తమకు చివరికి శవాన్ని అప్పగించారని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. మరోవైపు, విద్యార్థి మృతికి కారణాలను అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు, సిబ్బందితో పాటు విద్యార్థులను విచారిస్తున్నారు.