వరంగల్ మీదుగా తిరుపతికి కొత్త రైలు.. శ్రీవారి భక్తులకు పండుగే!
దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు సుదూర ప్రయాణాలు సౌకర్యవంతంగా చేయటం కోసం రైల్వే శాఖ అమృత్ భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ళను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రజల అవసరాలకు తగ్గట్టు వందే భారత్, వందేభారత్ స్లీపర్ రైళ్ళు, బుల్లెట్ రైళ్ళను అందుబాటులోకి తెస్తున్న సర్కార్, అమృత్ భారత్ స్లీపర్ రైళ్ళను కూడా అందుబాటులోకి తెస్తుంది.ప్రజల ప్రయాణ అవసరాలను తీరుస్తుంది.
వరంగల్ మీదుగా తిరుపతి వెళ్లే ప్రయాణికులకు మంచి వార్త
ఈ క్రమంలో తాజాగా వరంగల్ మీదుగా తిరుపతి వెళ్లే ప్రయాణికులకు మంచి వార్త చెప్పింది దక్షిణ మధ్య రైల్వే . రైల్వే శాఖ ధన్బాద్ నుంచి కోయంబత్తూరు వరకు కొత్త అమృత్ భారత్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించింది. ఈ రైలు వరంగల్, రేణిగుంట స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. రైలు నంబర్ 22363 గల ఈ సర్వీసు ప్రతి శనివారం తెల్లవారుజామున 4:10 గంటలకు ధన్బాద్ నుంచి బయలుదేరుతుంది.

రైలు ప్రయాణ వివరాలివే
సోమవారం అర్ధరాత్రి తర్వాత 12:08 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. అదే రోజు ఉదయం 10:25 గంటలకు రేణిగుంటకు చేరుతుంది. తిరుపతి భక్తులు రేణిగుంటలో దిగి సులభంగా క్షేత్రానికి చేరుకోవచ్చు. తిరుగు మార్గంలో రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:50 గంటలకు కోయంబత్తూరు నుంచి బయలుదేరుతుంది. సాయంత్రం 4:20 గంటలకు రేణిగుంట, బుధవారం తెల్లవారుజామున 12:09 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. గురువారం మధ్యాహ్నం 1 గంటకు ధన్బాద్కు చేరుతుంది.
తిరుమల వెళ్ళే భక్తులకు పండుగే
ఈ రైలు పూర్తిగా నాన్-ఏసీగా నడుస్తుంది. తక్కువ ఖర్చుతో దూర ప్రయాణాలు చేసే సామాన్యులు, పేద ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరం. వరంగల్ నుంచి తిరుపతికి వెళ్లేవారికి ఈ రైలు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయగల సౌకర్యవంతమైన రైలు. దీంతో ప్రయాణం మరింత ఈజీ కానుంది. రైల్వే అధికారులు ఈ సర్వీసు సామాన్య ప్రజలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు.తిరుపతి వెళ్లేవారికి ఈ కొత్త రైలు అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది. తక్కువ ఖర్చుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు శ్రీవారిని దర్శించుకోవటానికి వీలు ఉంటుంది.














Click it and Unblock the Notifications