వరంగల్ ముంపు బీఆర్ఎస్ కబ్జాల వల్లే, ప్రజలు ఓడించుడు పక్కా: రావు పద్మా రెడ్డి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్యం అనే భాస్కర్ బరిలోకి దిగగా, కాంగ్రెస్ పార్టీ నుండి నాయిని రాజేందర్ రెడ్డి, బిజెపి నుంచి రావు పద్మా రెడ్డి ఎన్నికల బరిలో నిలిచి హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
Recommended Video

ఈ దఫా ఎన్నికలలో బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో కాషాయ జెండా ఎగురవేయాలి అనే దిశగా వ్యూహాత్మకంగా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారాన్ని కొనసాగిస్తున్న రావు పద్మారెడ్డికి ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. అయితే గత సంవత్సర కాలంగా రావు పద్మారెడ్డి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్య కోసం నిత్యం తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈసారి ఆమెపై ప్రజలలో సానుకూలమైన స్పందన వస్తుంది.

ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న రావు పద్మా రెడ్డి వన్ఇండియా తో మాట్లాడుతూ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల కోసం తాము చేసిన పోరాటం తమను గెలిపిస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్, వరంగల్ వెస్ట్ లో వినయ్ భాస్కర్ దోపిడీ కొనసాగిస్తున్నారని, ప్రజలు ఈ సారి తరిమికొట్టటం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల కబ్జాల వల్లే ఓరుగల్లు ముంపుకు గురయిందని అన్నారు.
అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లా ప్రజానీకం గత ఎన్నికల్లో బిజెపికి ఒక్క సీటు కూడా ఇవ్వనప్పటికీ, వరంగల్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ,హృదయ్, అమృత్ వంటి పథకాలు ఓరుగల్లు అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అందించారని, కేంద్రం వరంగల్ అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నప్పటికీ పాలకుల అలసత్వం వల్ల వరంగల్ నగరం అభివృద్ధి చెందలేదని అన్నారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి శూన్యంగా ఉందని రావు పద్మ వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని బాగా గుర్తించారని, ఈసారి బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని రావు పద్మ వెల్లడించారు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక స్థానం నుంచి పది స్థానాలకు వరంగల్ లో బిజెపి గ్రాఫ్ పెరిగిందని, ప్రజలతో తనకున్న సన్నిహిత సంబంధాలు కూడా తన విజయానికి కారణమవుతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఎంతోకాలంగా బిజెపికి జిల్లాలో సేవలందిస్తున్న రావు పద్మ గెలుపు కోసం పార్టీ శ్రేణులు కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. ఆమెకు వరంగల్ పశ్చిమలో అందరితో కలిసిపోయే నాయకురాలిగా మంచి పేరుంది. ఈ నేపధ్యంలోనే బీజేపీ నేతలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు బిజెపికి ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications