సంచలనంగా వరంగల్ యాసిడ్ దాడి: స్క్రూ డ్రైవర్తో కళ్లల్లో పొడిచారు.., ఆ పరిచయమే బలితీసుకుందా?
Recommended Video
వరంగల్: జిల్లాలో మరో యాసిడ్ దాడి ఘటన సంచలనం రేపుతోంది. భర్తతో విభేదాల కారణంగా.. తల్లితో కలిసి జీవిస్తోన్న ఓ వివాహితపై యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడి చేయడమే కాదు, ఆమె కళ్లను నిర్దాక్షిణ్యంగా స్క్రూడ్రైవర్ తో పొడిచేసినట్లు సమాచారం.
మాజీ ప్రియుడు.. పెళ్లిచేసుకోలేదని.. యాసిడ్ పోసేశాడు!
ముఖం పూర్తిగా కాలిపోయి.. అత్యంత విషమ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. పెళ్లి చేసుకోవాలని వేధిస్తోన్న ఆటో డ్రైవర్ చందు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడన్న అనుమానాలు బలపడుతున్నాయి. యాసిడ్ దాడి కలకలం ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎవరీ మాధురి?:
రంగల్ మట్టెవాడ ప్రాంతంలో నివాసముండే గొండ సుజాతకు ముగ్గురు కుమార్తెలు. రెండో కూతురైన మాధురి(31) అలియాస్ మధుకు మూడేళ్ల క్రితం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్కు చెందిన చంటితో వివాహం జరిగింది. చంటి మాధురికి స్వయానా మేనమామ అని తెలుస్తోంది. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది.
పెట్రోల్ బంకులో జాబ్:
బిడ్డ పుట్టిన తర్వాత మాధురి-చంటి వైవాహిక జీవితంలో కలహాలు చోటు చేసుకున్నాయి. అప్పటినుంచి భర్తకు దూరంగా వరంగల్ రాజరాజేశ్వరీదేవి ఆలయ సమీపంలోని తల్లిగారింట్లోనే మాధురి ఉంటోంది. జీవనోపాధి రీత్యా స్థానిక సాకరాసికుంట పెట్రోల్ బంకులో కొన్నాళ్లు పనిచేసింది.
చంటితో పరిచయం:
పెట్రోల్ బంకులో పనిచేస్తున్న సమయంలోనే ఆటో డ్రైవర్ అయిన చందుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. తరుచూ అతను ఆమెతో మాట్లాడుతుండేవాడు.
అయితే పెళ్లికి ముందే మాధురికి చంటితో పరిచయముందని, పెళ్లి తర్వాత కూడా అతను ఆమెతో మాట్లాడేవాడనే వాదన కూడా వినిపిస్తోంది. ఓరోజు చంటి పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి మాధురితో గొడవ పడటంతో యాజమాన్యం ఆమెను పనిలో నుంచి తీసేసినట్లు చెబుతున్నారు.
పని వెతుక్కుంటానని వెళ్లి:
పెట్రోల్ బంకులో పని కోల్పోవడంతో ఏదైనా పని వెతుక్కుంటానని చెప్పి బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చింది మాధురి. అనూహ్యంగా ఐనవోలు మండలంలోని గర్మిళ్లపల్లి గ్రామంలో స్వామివారి పాదాల బండ సమీపంలో ఉన్న చెట్ల పొదల మధ్య యాసిడ్ దాడికి గురై కొన ఊపిరితో కొంతమంది వ్యవసాయ కూలీలకు కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
బలవంతంగా ఆటోలో:
యాసిడ్ దాడితో ఆమె ముఖంతో పాటు మెడ భాగాలు కాలిపోయాయి. శరీరంపై గాయాలు, దెబ్బలు కూడా ఉన్నాయని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. నిందితులు మాధురిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు.
అతని పనే?:
హనుమకొండలోని హంటర్ రోడ్డు సాకారాసికుంట పెట్రోల్ బంకులో పనిచేస్తున్నప్పటి నుంచే మాధురిని వివాహం చేసుకుంటానని చందు వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో ఆరు రోజుల క్రితం అతనిపై మట్టెవాడ పోలీస్ స్టేషన్ లోను ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.మాధురిపై యాసిడ్ దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న చందును, మరో ఇద్దరిని బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణలో అసలు విషయాలు నిగ్గు తేలనున్నాయి.