అది కెసిఆర్ కుటుంబానికి క్యాష్ లైన్: రేవంత్ రెడ్డి వ్యాఖ్య
నల్గొండ/ ఖమ్మం: వాటర్గ్రిడ్ పైపులైన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కుటుంబానికి క్యాష్లైన్ అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్లో వాటర్గ్రిడ్ పైలాన్ను టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
రూ. 2కోట్లతో నిర్మించిన పైలాన్ నెలరోజుల్లోనే శిధిలావస్థకు చేరిందన్నారు. దీన్ని బట్టి 40వేల కోట్లతో చేపట్టబోతున్న వాటర్గ్రిడ్ ప్రాజెక్టు ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. అవినీతి పాలనకు వాటర్గ్రిడ్ పైలానే నిదర్శనమన్నారు.
విపక్ష పార్టీల నేతలపై రాష్ట్ర మంత్రుల విమర్శలు అర్ధరహితంగా ఉన్నాయని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. రుణమాఫీపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అబద్దాలు చెబుతున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమాలకే సరిపోతారని ఆయన అన్నారు.
కెసిఆర్ పరిపాలనకు అసమర్ధుడని, కమ్యూనిస్టుల ఐక్యతను చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అలాగే ఈనెల 25, 26 తేదీల్లో నాగార్జునసాగర్లో సీపీఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతాయని, ఈ సమావేశాల్లో సీపీఎం పార్టీ బలోపేతంపై చర్చ జరగనుందని చెప్పారు.
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు వారం రోజులపాటు నీటిని విడుదల చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎడమ కాలువ కింద దాదాపు లక్ష ఎకరాల్లో వరిపంట పొట్ట దశలో ఉందన్నారు. నీరు లేకపోవడం వల్ల వరి పంట అంతా ఎండిపోయే ప్రమాదముందన్నారు. కావున వారం రోజులపాటు ఎడమకాలువకు నీటిని విడుదల చేయాలని ఆయన కోరారు.
ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారు
తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య అన్నారు. బుధవారం ఖమ్మంలోని ఎస్బీహెచ్ జిల్లా మెయిన్బ్రాంచ్ ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడారు.
రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని వారన్నారు. ఏకకాలంలో రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వడం లేదన్నారు. దీంతో రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతు సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తే బలవంతంగా బయటకు పంపించారని వారు పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆయా పథకాల్లో అక్రమాలు, అవినీతి చోటుచేసుకుంటున్నాయని, ప్రచారాల కోసం కోట్లాది రూపాయలను ఖర్చుపెడుతున్న ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో రుణమాఫీని ఎందుకు చేయలేకపోతోందని వారు ప్రశ్నించారు.