వాటర్ వార్: ఐదేళ్ళు నిద్ర పోయారా? డిండిపై ఏపీ పిటిషన్ను కొట్టేయండి; ఎన్జీటీలో తెలంగాణ అఫిడవిట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారం అవుతాయన్న భావన ఏ మాత్రం కలగడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల మీద తెలంగాణ, తెలంగాణ ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ పెడుతున్న కేసులు, వినిపిస్తున్న వాదనలు, పెడుతున్న మెలికలు చూస్తే ఈ వివాదాలు పరిష్కారం అవుతాయన్న భావన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కనిపించటం లేదు. తెలంగాణా ఏపీ జలజగడాలు సీరియల్ ఎపిసోడ్స్ లా ఇలా కొనసాగుతూనే ఉంటాయా అన్న అనుమానం కలుగుతుంది. ఈ వాటర్ వార్ వల్ల ఇరు రాష్ట్రాలకు నష్టం జరుగుతున్నా సరే రెండు రాష్ట్రాలు పట్టుదల మాత్రం విడవటం లేదు.

డిండి ప్రాజెక్టు పై ఏపీ అభ్యంతరం .. తెలంగాణా కౌంటర్
ఇక తాజాగా ఏపీ తెలంగాణ వాటర్ వార్ లో భాగంగా డిండి ప్రాజెక్టు పై ఏపీ వ్యక్తం చేసిన అభ్యంతరం పై తెలంగాణ కౌంటర్ వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి, తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయాలని కోరుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలలోని ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని ఏపీ సర్కార్ ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘించిందని, కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘం, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే ఈ పథకాన్ని చేపట్టిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకు వెళ్ళింది.

ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న తెలంగాణా
అయితే తాజాగా డిండి ప్రాజెక్టును సవాలు చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ లో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో అఫిడవిట్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2016 లోని ఈ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టిందని, అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఇన్నాళ్ళూ నిద్రపోయి ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత పిటిషన్ వేసిందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

అప్పుడే అడ్డుకోకుండా ఇప్పుడు పిటిషన్ వేయడంలో ఆంతర్యం
ఇది ఎన్జీటీ చట్టంలో పేర్కొన్న కాలపరిమితికి విరుద్ధంగా ఉందని తెలంగాణ సర్కార్ వెల్లడించింది. దురుద్దేశంతోనే అవాస్తవాలను ఏపీ ప్రభుత్వం మాట్లాడుతోందని తెలంగాణా పేర్కొంది . ఇన్ని రోజులుగా ఈ ప్రాజెక్టు పనులు కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియదని భావించలేమని పేర్కొంది. 6190 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టును చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం 2015 జూన్ 11వ తేదీన పరిపాలన అనుమతి ఇచ్చిందని, ఈ ప్రాజెక్టు గురించి మీడియాలో కూడా విస్తృతంగానే ప్రచారం అయిందని అభ్యంతరం ఉంటే అప్పుడే అడ్డుకోకుండా ఇప్పుడు పిటిషన్ వేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది.

ఐదేళ్ల పాటు నిద్రపోయి ఇప్పుడు ఏపీ పిటీషన్ వేసింది
అసలు ఈ కేసులో విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేసిన పిటిషన్ ను కొట్టివేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఏపీ పిటిషన్ దాఖలు చేయాలనుకుంటే సమస్య ఉత్పన్నమైన ఆరు నెలల్లోనే పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం చెబుతోందని తెలంగాణ గుర్తు చేసింది. ఏపీ అభ్యంతరం ఐదేళ్ళ తర్వాత కాదని తేల్చి చెప్పింది. ఐదేళ్ల పాటు నిద్రపోయి, ఇప్పుడు అభ్యంతరకరమైన ప్రాజెక్ట్ అంటే ఎలా అంటూ తెలంగాణ ప్రశ్నించింది. శ్రీశైలం రిజర్వాయర్ నుండి డిండి రిజర్వాయర్ రోజు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల పాటు 30 టీఎంసీల నీటిని తరలించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం అని పేర్కొన్న తెలంగాణ ఈ ప్రాజెక్టు కింద 19 మండలాల్లో మూడు లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోందని వెల్లడించింది .

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణా పరిధిలోని అంశం కాదు
నల్గొండ జిల్లా దేవరకొండ, మునుగోడు, మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలకు నీరు అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్లో చాలా తప్పుదోవ పట్టించే అంశాలు ఉన్నాయని పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని నిబంధనలు, అంశాలపై ఆధారపడి ఈ పిటిషన్ ను దాఖలు చేసిన కారణంగా, దీనిని విచారించే పరిధి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు లేదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. మరి ఈ వ్యవహారంలో తెలంగాణ వాదనపై ఏపీ ఏం చెప్పబోతోంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేయబోతుంది అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

రెండు తెలుగురాష్ట్రాల మధ్య జటిలం అవుతున్న జలజగడం
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్రాన్ని ఇరికిస్తున్న ఏపీ ప్రభుత్వం ఎన్జీటీలో బలంగా వాదన వినిపిస్తుంది. కేంద్రం వైఖరి చెప్పాలంటూ, ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కోరుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదన వినిపించింది. రాయలసీమ ఎత్తిపోతల మొదలుపెట్టిన ఏపీ సర్కార్ తీరుపై తెలంగాణా అభ్యంతరం వ్యక్తం చెయ్యటంతో మొదలైన రగడ మళ్ళీ చిలికి చిలికి గాలివానగా మారి రెండు తెలుగు రాష్ట్రాల జలజగడాన్ని మరింత జటిలం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కృష్ణా, గోదావరీ నదీ జలాల కోసం రచ్చ కొనసాగేలా చేసింది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications