'జానాను మార్చడం లేదు, డీఎస్ జంప్తో కాంగ్రెస్కు నష్టం లేదు'
హైదరాబాద్: తెలంగామ సీఎల్పీ నేతగా జానారెడ్డిని మార్చే ఉద్దేశం లేదని ఏఐసీసీ కార్యదర్శి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాను ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి అభిప్రాయాన్ని సేకరించ లేదని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
డీఎస్ లాంటి వారు పార్టీ మారడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని కుంతియా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు గాను త్వరలో గ్రామ స్ధాయిలో కమిటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందు కోసం విరాళాలు కూడా సేకరిస్తున్నామన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 50 లక్షల సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకుందని, ఈ నెలాఖరుకల్లా ఈ కార్యక్రమం దాదాపు 25 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈనెల 24న రాహుల్ గాంధీ అనంతపురంలో పర్యటిస్తారని తెలిపారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు రాహుల్ సమారు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా వరంగల్ ఉప ఎన్నికలో పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మీరాకుమార్ ప్రస్తావన రాలేదని చెప్పారు.
వ్యాపమ్ కుంభకోణంపై ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులకు ఇప్తార్ విందులను ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.