'మృతిపై త్వరలో రిపోర్ట్, ఎప్పుడో చెప్పలేం': గుంటూరులో రోహిత్ తండ్రిని ప్రశ్నిస్తున్న టి పోలీస్
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ ఘటన పైన కేంద్రం వేసిన ద్విసభ్య బెంచ్ విచారణ జరిపింది. విచారణ జరిపిన అనంతరం ఆ బెంచ్ బుధవారం నాడు ఢిల్లీకి బయలుదేరింది.
ఈ సందర్భంగా విచారణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... రోహిత్ ఆత్మహత్య పైన అందరి నుంచి వివరాలు సేకరించామని చెప్పారు. త్వరలోనే కేంద్రానికి నివేదిక ఇస్తామన్నారు. అయితే ఎప్పుడు ఇచ్చేది ఇప్పుడే చెప్పలేమని సభ్యులు చెప్పారు.
గురజాలలో రోహిత్ తండ్రిని ప్రశ్నిస్తున్న పోలీసులు
రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో గుంటూరు జిల్లా గురజాలలో అతని తండ్రిని పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. రోహిత్ తండ్రిని తెలంగాణ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, రోహిత్ ఆత్మహత్య ఘటన, విచారణ పైన దృష్టి సారించినట్లు ఎస్సీ ప్యానెల్ చీఫ్ చెప్పారు.
శవ రాజకీయాలు మానండి: ఏబీవీపీ
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారంటూ ఏబీవీపీ బుధవారం ఘాటుగా స్పందించింది. ఈ రోజు ఉదయం ఏబీవీపీ 'సేవ్ హెచ్సియు' పేరిట ఆందోళనకు దిగారు. రోహిత్ అసలు దళితుడే కాదని ఆవేదన వ్యక్తం చేసింది. కుల, శవ రాజకీయాలు వీడాలని హితవు పలికింది.
కాగా, రోహిత్ ఆత్మహత్యపై పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై మంగళవారం దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లోనూ, హెచ్సీయూలోనూ ఆందోళనలు, ర్యాలీలు జరిగాయి. ఉద్రిక్తతలు కొనసాగాయి. రోహిత్ మృతికి కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలే కారణమని.. వారిని వెంటనే బర్తరఫ్ చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. హెచ్సీయూకు నేతలు వరుసకట్టారు.