సొంత ప్రయోజనాలా!: కేంద్రం-ఏపీ-తెలంగాణలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: న్యాయాధికారుల విభజన పైన సుప్రీం కోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సొంత ప్రయోజనాల కోసం పాకులాడటం వల్లనే వివాదాలు అని వ్యాఖ్యానించింది.
న్యాయాధికారుల నియామక ప్రక్రియ పైన స్టే విధించడానికి నిరాకరించింది. సుప్రీం కోర్టు తుది తీర్పుకు లోబడే నియామకాలు జరిగాయని, న్యాయాధికారులను విభజించేది కేంద్రమా, హైకోర్టా అనేది నిర్ణయిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
విభజనకు ముందు అందరూ కలిసి ఉన్నారని, సొంత ప్రయోజనాల కోసం చూడటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది. విద్వేషాలను రెచ్చగొట్టవద్దని అత్యున్నత న్యాయస్థానం హితవు పలికింది. అందరి ప్రయోజనాలను కాపాడుతామని పేర్కొంది.
ఈ విషయమై కేంద్రం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. న్యాయాధికారుల కేటాయింపు అంశంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
న్యాయాధికారుల నియామకాల అంశంలో న్యాయం చేస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. అందరి అభిప్రాయాలు తీసుకొని సమస్య పరిష్కరిస్తామని చెప్పింది. కేంద్రం కూడా సహకరిస్తుందని చెప్పింది. సమస్యను పెద్దగా చేయవద్దని సూచించింది.
తమ హామీ మేరకు సమ్మె విరమించినందుకు సంతోషమని, ఉభయులకు న్యాయం జరిగేలా చూస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. తమ పైన విశ్వాసం ఉంచాలని చెప్పింది. విభజన చట్టం ప్రకారం న్యాయాధికారులను విభజించే అధికారం హైకోర్టుకు లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.