Weather: ఓ వైపు ఎండలు మండిపోతున్నా.. మరోవైపు నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ విదర్భ నుంచి మరాట్వాడా, కర్ణాటక మీదుగా ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి సుమారు 0.9 కిమి ఎత్తు వద్ద ఉన్న ఉపరితల ద్రోణి బుధవారం స్థిరంగా కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దీని ప్రభావం వలన బుధవారం తెలంగాణ రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గురు,శుక్ర వారాలు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో ప్రజలు బయటికి వెళ్లకపోవడమే మంచిదని వాతావరణ శాఖ అధికారులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు అధికంగానే ఉన్నాయి. దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో బుధవారం వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రలో పొడి వాతావరణం, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దీంతో ప్రజలకు విపరీతమైన ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. అయితే, రాయలసీమలో మాత్రం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications