weather update: మరో 48 గంటలపాటు తెలంగాణలో భారీ వర్షాలు
హైదరాబాద్: గత ఒకటి రెండు రోజులుగా కాస్త విరామం తీసుకున్న వర్షాలు మళ్లీ వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో శనివారం, ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని పేర్కొంది.
ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. పశ్చిమ భారతదేశం నుంచి తెలంగాణవైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణం కేంద్రం తెలిపింది. కాగా, శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వార్షాలు కురిశాయి. వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్లో 2.5, పెబ్బేరులో 1.8, గద్వాలలో 1.2 సెంటిమీటర్ల వర్షం కురిసింది.
ప్రాజెక్టులకు భారీగా వరద నీరు..
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నాగార్జునసాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది. గత నాలుగు రోజులుగా వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 5 లక్షల 36 వేల క్యూసెక్కులకుపైగా నమోదైంది. శ్రీశైలం డ్యామ్ గేట్లన్నీ ఎత్తి విడుదల చేస్తుండడంతో ఐదు లక్షల ముప్పై వేల క్యూసెక్కుల వరద పరవళ్లు తొక్కుతూ సాగర్ కు చేరుకుంటోంది.
మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో నాగార్జునసాగర్ డ్యామ్ పూర్తిగా నిండిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 569 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 233 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మరో 48 గంటల్లో జలాశయం గరిష్ట నీటి మట్టనికి చేరుకునే అవకాశం ఉందని, ఆ తర్వాత క్షణాన్నైనా డ్యామ్ గేట్లు ఎత్తేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.