కెసిఆర్ గ్రామానికి రోడ్డు వేసింది మేమే: రేవంత్ రెడ్డి, హరీష్ రావుకు ప్రశ్నల వర్షం
హైదరాబాద్: ప్రపంచంలో గుర్తింపు పొందిన ఐటీ సంస్థలను రప్పించి, ఐదు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శనివారం అన్నారు.
కెసిఆర్ స్వగ్రామానికి రోడ్డు వేసింది టిడిపి ప్రభుత్వం హయాంలోనే అని చెప్పారు. గత ప్రభుత్వాలు ఆంధ్రాకు ఎక్కువ నీటిని కేటాయించాయని మంత్రి హరీష్ రావు పదేపదే చెబుతున్నారని, 2004లో వైయస్ హయాంలో మంత్రిగా పని చేసిన ఆయన అఫ్పుడెందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు.
తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సమస్యకు పరిష్కారం చూపించాల్సిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆర్థిక సంక్షోభంలో ఉన్న చైనా యాత్రకు వెళ్లడం విడ్డూరమే అన్నారు. సమస్యలు పరిష్కరించకుంటా చైనా యాత్రలా అన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వవలసింది పోయి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోందన్నారు. తెలంగాణలో టిడిపిని బలహీనం చేద్దామనే ఆలోచనను కెసిఆర్ మానుకొని అభివృద్ధి పైన దృష్టి సారించాలన్నారు.
అవినీతి మంత్రులకు అండగా మోదీ ప్రభుత్వం
అవినీతిని అంతమొందిస్తానని, బ్లాక్ మనీని బయటకు తీసుకొస్తానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు అవినీతి మంత్రులకు అండగా నిలుస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అవినీతి మంత్రుల విషయంలో ప్రధాని మోడీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శనివారం ఖమ్మం బస్టాండ్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్ అడ్డుకుందంటూ బిజెపి ప్రచారం చేయటం హాస్యాస్పదమన్నారు. సమావేశాలు నెలరోజుల పాటు కూడా నడవలేదన్నారు. బిజెపి వల్లనే పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగలేదని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు సుష్మాస్వరాజ్, వసుంధరరాజే, శివరాజ్ చౌహాన్లకు అండగా కేంద్ర ప్రభుత్వం నిలబడినందుకే పార్లమెంటు సమావేశాలు స్తంభించాయన్నారు.