'గులాబీ జెండాకు మేము కూడా ఓనర్లమే' అనడమే కొంప ముంచిందా.?ఈటల టార్గెట్ వెనక అసలు మతలబేంటి.?
హైదరాబాద్ : ఎలాంటి విభేదాలు, వివాదాలు, అంతర్గత కలహాలు, గ్రూపు రాజకీయాలు లేకుండా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ పేరుతో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మొత్తం క్యాబినెట్ ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు కనుసన్నల్లో కదులుతున్నప్పట్టికి ఈటల రాజేందర్ అంశంలో మాత్రం సీఎం చంద్రశేఖర్ రావుకు మింగుడుపడని అంశంగా పరిణమించింది. ఆర్థిక మంత్రిగా ఐదేళ్లు పనిచేయడం అంటే ప్రభుత్వంలో దాదాపు సీఎం తర్వాత స్థానంలో పనిచేయడమే. అంటే ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉండడమే. అంతటి కీలక పదవులు నిర్వహించిన వ్యక్తి మీద అకస్మాత్తుగా భూకబ్జా ఆరోపణలు రావడం, ముఖ్యమంత్రే విచారణకు ఆదేశించడం, ఈటల రాజేందర్ పోర్ట్ ఫోలియోను తొలగించడం వంటి చర్యలు చకచకా జరిగిపోయాయి.
ఇది ముమ్మాటికి కక్ష్య సాధింపే..
ఇదిలా ఉండగా ఈటల మీద ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇంతటి వేగవంతమైన చర్యలు తీసుకోవడానికి గల కారణాలేంటి..? పార్టీలో, ప్రభుత్వంలో రెండవ స్థానంలో ఉన్న ఈటల మీద ఇంత కఠినంగా వ్యవహరించడం వెనక మతలబు ఏమైనా ఉందా.?గతంలో ఇవే భూ కబ్జా ఆరోపణలు అనేక మంది ప్రజాప్రతినిదుల మీద వెలుగులోకి వచ్చాయి. కాని ఎవ్వరి మీద ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించిన దాఖలాలు లేవు. మరి ఈటల రాజేందర్ మీదనే ఎందుకు ఇంత వేగవంతమైన చర్యలు తీసుకున్నారన్నదే చిక్కుప్రశ్నగా మారింది. అంతే కాకుండా ఈటల నిర్వహిస్తున్న శాఖలను కూడా తొలగించడం అంటే మంత్రి వర్గం నుండి ఈటలకు ఉద్వాసన పలుకుతారా అన్న అంశం ఆసక్తిగా మారింది.
ఎంతో మంది ప్రజా ప్రతినిధులపై ఆరోపణలు..
కాగా ఈటల భూ కబ్జా ఆరోపణల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వాస్తవాలను బహిర్గతం చేసేందుకు విచారణకు దిగిన రెవెన్యూ, విజిలెన్స్ వర్గాలు ఇప్పటికే ప్రాథమిక నివేదికను సిద్ధం చేశాయి. మూడెకరాల అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందించనట్లుగా రూడీ అయినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ నిర్ధారించారు. ఇదే సర్వే వివరాలను కలెక్టర్ హరీష్ పరిశీలించారు. మాసాయిపేట తహసీల్దార్ ఆఫీస్లో మకాం వేసిన కలెక్టర్, భూ రికార్డులను పరిశీలించారు. ఏండ్ల నుంచి ఉన్న రికార్డులను క్షుణంగా తనిఖీ చేశారు. అనంతరం ఈటల నిర్మాణం చేస్తున్న జమునా హాచరీస్లో మూడు ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని ప్రాథమిక విచారణలో తేలినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
సీఎంకు చేరిన నివేదికలు..
అయితే క్షేత్రస్థాయి సర్వే కూడా పూర్తి చేసి నివేదికను సీఎస్కు సమర్పించే అవకాశం ఉంది. రెవెన్యూతో పాటుగా విజిలెన్స్ నివేదిక కూడా ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావుకు సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈటల వ్యవహారంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వెడెక్కింది. అంతే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఈటలకు మద్దతు కూడా పెరుగుతోంది. ఒకవేళ మంత్రి వర్గం నుంచి ఈటలను తప్పిస్తే పరిణామాలు ఎలా ఉంటాయనే అంశాలపై కూడా ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకుంటున్నట్లు సమాచారం.
అంతా కావాలనే చేస్తున్నారంటున్న ఈటల ఫాన్స్..
కాగా ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు విచారణ, ఉన్నట్టుండి పదవీచ్యుతుడిని చేయడం పట్ల ఈటల అనుచరులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుండి ఉద్వాసన పలికేందుకే ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారని ఈటల రాజేందర్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని వేదికల మీద ఈటల రాజేందర్ పార్టీ గురించి, పార్టీ జెండా గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ వస్తున్నారు. గులాబీ జెండా ఒక్క చంద్రశేకర్ రావుకు మాత్రమే సంబందించింది కాదు తమకు కూడా భాగస్వామ్యం ఉందని అర్థం వచ్చేలా ఇటీవల ఈటల పబ్లిక్ గా మాట్లాడారు. అప్పటినుండి ముఖ్యమంత్రి దృష్టిలో ఈటల విలన్ గా మారినట్టు గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే భూకబ్జా వ్యవహారాలను వెలికి తీసి ఈటలకు ఉద్వాసన పలకాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని గులాబీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తోంది.