కారణమిదే: బాలాపూర్ లడ్డూ ఎందుకీ ప్రత్యేకత?
హైద్రాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలకు పెట్టింది పేరు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహన్ని దర్శించుకొనేందుకు ప్రతి ఏటా వేలాదిమంది భక్తులు వస్తుంటారు.
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలకు పెట్టింది పేరు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహన్ని దర్శించుకొనేందుకు ప్రతి ఏటా వేలాదిమంది భక్తులు వస్తుంటారు. అయితే కాల క్రమంలో గణేష్ మండపాల వద్ద నవరాత్రుల సందర్భంగా ఉంచే లడ్డూలకు ప్రత్యేకత నెలకొంది. ఈ లడ్డూల వేలం పాట నిర్వహిస్తారు. బాలపూర్ లడ్డూకు ఏటేటా క్రేజీ పెరుగుతూ వస్తోంది.
1980లో మొదలైన బాలాపూర్ గణేశుడి ప్రస్థానం... 23 ఏళ్లుగా లడ్డూ వేలం పాటతో మరింత ఖ్యాతిని చాటుకుంది. స్థానికులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఇక్కడి గణేశుడి దర్శనానికి వస్తుంటారు.
వినాయకుడి చేతిలో నవరాత్రి పూజలు అందుకొన్న లడ్డూను వేలంపాటలో కొనుగోలు చేస్తే వారికి అన్ని శుభాలే కలుగుతాయని భక్తుల విశ్వాసం.దీంతో ఈ లడ్డూల వేలం కోసం భక్తులు పోటీ పడుతుంటారు.
బాలాపూర్లో ప్రారంభమైన లడ్డూల వేలం పాటు నగరం మొత్తం వ్యాపించింది. ఈ లడ్డూల వేలంపాటలో పాల్గొనేందుకు భక్తులు పోటీపడుతుంటారు. ఈ లడ్డులను కొనుగోలు చేస్తే మంచి జరుగుతోందని భక్తుల విశ్వాసం.
1994 నుండి బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట
1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలంపాట ప్రారంభమైంది. . మొదట 450 రూపాయలతో ప్రారంభమైన లడ్డూ వేలం...క్రమంగా వందలు, వేలు దాటి లక్షలకు చేరింది. గణేశ్ లడ్డూ దక్కించుకున్నవారి ఇంట సిరిసంపదలు తులతూగుతాయని, పసిడి పంటలు పండుతాయని స్థానికుల విశ్వాసం. ఈ వేలంలో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
బాలాపూర్ వాసులే వేలంపాటలో పాల్గొనేవారు
బాలాపూర్ లడ్డూ వేలం పాటలో తొలుత బాలాపూర్ వాసులే పాల్గొనేవారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు చెందినవారు కూడ ఈ వేలంపాటలో పాల్గొంటున్నారు. ఈ లడ్డూను తాపేశ్వరం హనీపుడ్స్ తయారుచేస్తుంది. 21 కిలోల బరువు ఉండే ఈ లడ్డూను 2010 నుంచి బాలాపూర్ గణేశుడికి ఆ దుకాణ యజమాని ఉమామహేశ్వర్ రావు నైవేద్యంగా సమర్పిస్తున్నారు.
రికార్డ్ ధరలో బాలాపూర్ లడ్డూ వేలం
రియల్ ఏస్టేట్ ప్రభావంతో బాలాపూర్ లడ్డూ వేలం పాటలో వేల నుండి లక్షల్లో చేరింది. 2002 నుండి లడ్డూ వేలం పాట వేల నుండి లక్షల్లోకి చేరుకొంది. బాలాపూర్ కు చెందిన కొలను కుటుంబసభ్యులే వరుసగా లడ్డూను చేజిక్కించుకునేవారు. కానీ స్థానికేతరులు కూడా రంగంలోకి దిగడంతో లక్ష కాస్త మరో లక్షకు చేరింది. అలా... 2008లో 5.07 లక్షలు, 2009లో 5.10 లక్షలు, 2010లో 5.35 లక్షలు, 2011లో 5.45లక్షలు, 2012లో ఏకంగా 7.50 లక్షలు పలికింది. 2013లో మహేశ్వరం శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి ఏకంగా రూ.9.26 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం 2014 లో బాలాపూర్ కు చెందిన రైతు సింగిరెడ్డి జైహింద్ రెడ్డి పోటీపడి 9. 50 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. 2015లో కళ్లెం రామకృష్ణారెడ్డి, మదన్ మోహన్ రెడ్డిలు తమ తండ్రి కళ్లెం రాంరెడ్డి జ్ఞాపకార్థం. రూ.10.32లక్షలకు గణేశుడి లడ్డూను సొంతం చేసుకున్నారు. 2016లో మేడ్చల్ కు చెందిన స్కైలాబ్ రెడ్డి రికార్డుస్థాయిలో 14.65 లక్షల రూపాయలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. ఇక ఈ ఏడాది జూబ్లీహిల్స్ కు చెందిన నాగం తిరుపతిరెడ్డి ఏకంగా రూ.15.60లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.
వేలం పాట నిధులు గ్రామాభివృద్దికి ఖర్చు
వేలం పాటతో వచ్చిన నిధులను గ్రామాభివృద్దికి ఖర్చు చేస్తున్నారు. స్థానికులే కాదు స్థానికేతరులు ఈ లడ్డూ వేలంపాటలో పాల్గొనడం ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు వస్తే గ్రామాభివృద్దికి ఖర్చు చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 39 లక్షలను గ్రామం కోసం ఖర్చు చేశారు.