సీఎం కేసీఆర్ దొరగారి దర్శన భాగ్యమెప్పుడో: అరాచకాలంటూ విజయశాంతి చురకలు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో కేసీఆర్ దొరగారి పాలన ఎంత అరాచకంగా ఉందో తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయన్నారు. ఈ మేరకు ఫేస్బుక్ వేదికగా విమర్శలు సంధించారు.

అన్యాయాన్ని ప్రశ్నిస్తే..
‘కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఎన్ని అవమానాల పాలవుతున్నారో ఔట్సోర్సింగ్ నర్సుల ఆందోళన చూస్తే తెలుస్తుంది. పోస్టింగులు, సీనియారిటీ, జీతాల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రోడ్డెక్కిన నర్సులకు జవాబు చెప్పలేక సర్కారు నీళ్ళు నములుతోంది' అని విజయశాంతి మండిపడ్డారు.

ఉద్యోగుల జీతాల్లో దారుణమైన కోతలా?
అంతేగాక, ‘ఇక ఆర్టీసీ సిబ్బందికి అందిన జూన్ నెల జీతాల్లోనూ ఆందోళన నెలకొంది. దారుణమైన కోతలతో ఆర్టీసీ సిబ్బందికి ఇచ్చిన జీతం డబ్బులతో ఏ విధంగా బతుకీడ్చాలో తెలియక వారు కుమిలిపోయే పరిస్థితి తీసుకొచ్చారు' అని తెలంగాణ సర్కారుపై విజయశాంతి ధ్వజమెత్తారు.

కేసీఆర్ దొరగారి దర్శనమెప్పుడో..
‘ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సీఎం గారు ఎప్పుడు ఫాంహౌస్లో ఉంటారో... ఎప్పుడు ప్రగతిభవన్లో దర్శనమిస్తారో తెలియని దుస్థితి నెలకొంది. ఇదేనా మీరు చెప్పిన బంగారు తెలంగాణ? ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది? సీఎం దొరగారు జవాబు చెప్పాలి' అంటూ విజయశాంతి చురకలంటించారు.
Recommended Video

కేసీఆర్కు తిరుగుబాటు, తిరస్కారం తప్పదు..
ఇక అంతకుముందు పోస్టులోనూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు విజయశాంతి.
‘శిశుపాలుడి తప్పుల మాదిరిగా, తెలంగాణ సీఎం కేసీఆర్ గారి తప్పులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇంతకాలం ప్రజాతీర్పు తనకు అనుకూలంగా ఉందని విర్రవీగిన పోయిన దొరగారు... త్వరలో తెలంగాణ ప్రజల తిరస్కారాన్ని, తిరుగుబాటును ఎదుర్కొనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తాజా పరిణామాలను చూస్తుంటే అర్థం అవుతోంది. ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలు ఇస్తూ, మాయమాటలు చెప్పి, తనను మేధావిగా ప్రదర్శించుకునే ప్రయత్నం చేసే కెసిఆర్ గారు... కరోనా మహమ్మారిని కట్టడి చేసే విషయంలో చేతులెత్తేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్గా మారింది. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తే సీఎం దొరగారు దాన్ని అవహేళన చేశారు. కరోనా కట్టడికి తగిన వైద్య వసతులు లేవని పత్రికల్లో వార్తలు వస్తే.. వాటి యాజమాన్యంపై కెసిఆర్ గారు శాపనార్థాలు పెట్టారు. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టినా... సీఎం దొరగారు దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు' అని విజయశాంతి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications