టీఆర్ఎస్ లో వారెక్కడ ? డైలమాలో ఆ కీలక నాయకుల రాజకీయ భవిష్యత్ !!
టీఆర్ఎస్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అధికారాన్ని చేతబట్టి ఒక వెలుగు వెలుగుతున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ . 2014 ఎన్నికల్లో విజయం సాధించి గద్దెనెక్కిన కేసీఆర్ సర్కారులో అప్పట్లో హేమాహేమీలు కీలక పాత్ర పోషించారు. సిరికొండ మధుసూదనాచారి, స్వామి గౌడ్, వంటి కీలక నేతలు శాసన సభ, శాసన మండలి తొలి చైర్మన్లుగా తమ మార్క్ చూపించారు. 2018 ఎన్నికలకు వచ్చేసరికి వారి చరిష్మా మసకబారింది . ఇప్పుడు ఏ పదవి లేక,పట్టించుకునేవారు లేక తీవ్ర మనస్తాపంతో ఉన్నారని తెలుస్తుంది.
టీఆర్ఎస్ లో టామ్ అండ్ జెర్రీ: మంత్రి సత్యవతి రాథోడ్ వస్తే ఎమ్మెల్యే రెడ్యా పరార్
తెలంగాణా తొలి స్పీకర్ గా వెలుగు వెలిగిన మధుసూదనాచారి
2014 ఎన్నికల్లో గెలిచిన మధుసూదనాచారి తెలంగాణ తొలి స్పీకర్ గా అత్యున్నత పదవిని అలంకరించారు. మంత్రి పదవి ఇస్తారని భావించిన, పలు సమీకరణాల దృష్ట్యా ఆయనకు స్పీకర్ గా బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. అటు నియోజకవర్గంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ స్పీకర్ గా ఒక వెలుగు వెలిగిన సిరికొండ మధుసూదనాచారి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక ఇదే సమయంలో సిరికొండపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గులాబీ పార్టీలో చేరి కీరోల్ పోషిస్తున్నారు.
సొంత నియోజకవర్గంలో కూడా తిరగలేని స్థితిలో మాజీ స్పీకర్
దీంతో ఇప్పుడు కనీసం సొంత నియోజకవర్గం భూపాలపల్లిలో కూడా ఇప్పుడు సిరికొండ జాడే కనిపించడం లేదు.కేసీఆర్ పట్టించుకోకపోవడంతో సిరికొండ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ముందు ముందు ఆయనకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారా అనేది కూడా అనుమానమే. ఇక అదే కోవలో తెలంగాణ శాసనమండలి తొలి చైర్మన్ గా పనిచేసిన స్వామి గౌడ్ పరిస్థితి కూడా దయనీయంగా తయారైంది .
ప్రశ్నార్ధకంగా శాసన మండలి తొలి చైర్మన్ స్వామీ గౌడ్ రాజకీయ భవిష్యత్
అటెండర్ స్థాయి నుంచి ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడిగా ఎదిగిన ఆయనకు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వామి గౌడ్ కు కేసీఆర్ తెలంగాణ శాసన మండలికి తొలి చైర్మన్ ను చేసి ఆదరించారు. ఐదేళ్లు పదవీకాలం అయ్యాక ఇప్పుడు ఆయన స్థానంలో గుత్తా సుఖేందర్ రెడ్డినికేసీఆర్ నియమించారు. స్వామి గౌడ్ కు ప్రస్తుతం ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఇక స్వామి గౌడ్ సైతం ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తు గురించి తీవ్ర మనస్థాపానికి గురవుతున్నట్లు గా తెలుస్తుంది.
అత్యున్నత పదవులతో వెలిగిన నేతలు కనుమరుగేనా ?
మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వంలో తొలి స్పీకర్ గా, తొలి శాసనమండలి చైర్మన్ గా ఒక వెలుగు వెలిగిన ఈ నేతలు ఇద్దరు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో, ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో సైలెంట్ గా చూస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ కూడా వీరిని పక్కన పెట్టినట్టే వారికి ఎలాంటి పదవులు ఇచ్చేది లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కీలక భూమిక పోషించి , అత్యున్నత పదవులు అలంకరించి వెలుగు వెలిగిన నేతలు ప్రస్తుతం కనుమరుగైపోయారు.