కండోమ్లు ఎక్కువగా వాడుతున్నది ముస్లింలే..: తేల్చేసిన ఒవైసీ
హైదరాబాద్: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్పైనా కౌంటర్ అటాక్కు దిగారు. ముస్లింల జనాభా పెరిగిపోతోందంటూ పరోక్షంగా ఆందోళన వ్యక్తం చేసిన ఉదంతంపై ఒవైసీ తాజాగా ఆరోపణలు గుప్పించారు.
మోహన్ భగవత్ ఏం చెప్పారు?
విజయదశమి నాడు మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో మతపరమైన అసమానతలు భారీగా పెరిగిపోయాయని, జనాభా అడ్డు అదుపు లేకుండా పెరగడం వల్ల మతపరమైన సమతౌల్యం దెబ్బతిన్నదని, దీన్ని నియంత్రణపై దృష్టి సారించాలంటూ మోహన్ భగవత్ పేర్కొన్నారు. దీనికోసం జనాభా నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు.
ఒవైసీ ఎదురుదాడి..
దీనిపై అసదుద్దీన్ ఒవైసీ.. ఎదురుదాడికి దిగారు. హైదరాబాద్ దారుస్సలాంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోల్పోయినట్టు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్రాల్లో నివసించే ప్రతి ముస్లిం కూడా ఓపెన్ జైలులో ఉన్నట్లుగా భావిస్తోన్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్లల్లో చోటు చేసుకున్న ఉదంతాలను ఆయన ప్రస్తావించారు.
వీధి కుక్కల కంటే హీనం..
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను వీధి కుక్కల కంటే హీనంగా చూస్తోన్నారని ఒవైసీ అన్నారు. ఉత్తరప్రదేశ్లో మదరసాలను బుల్డోజర్లతో ధ్వంసం చేశారని గుర్తు చేశారు. గుజరాత్లో దాండియా వేడుకలపై రాళ్లు వేశారనే కారణంతో ముస్లిం యువకులను నడి రోడ్డు మీద, అందరూ చూస్తుండగా పోలీసులు లాఠీలతో చితకబాదారని అన్నారు. వారిని కొడుతుంటే స్థానికులు చప్పట్లు కొడుతూ హర్షం వెలిబుచ్చారని పేర్కొన్నారు. ఇది భారత స్వాభావిక స్థితి కాదని ఒవైసీ చెప్పారు.
కండోమ్ వాడుతున్నది ముస్లింలే..
దేశంలో మతపరమైన సమతౌల్యం దెబ్బతింటోందంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఒవైసీ ప్రస్తావించారు. ముస్లింల జనాభా పెరగట్లేదని, పైగా తగ్గుతోందని చెప్పారు. టోటల్ ఫెటెర్నిటీ రేట్ (టీఎఫ్ఆర్)ను పరిగణనలోకి తీసుకుని తాను ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు. జనాభా నియంత్రణ కోసం కండోమ్లను ఎక్కువగా వాడుతున్నది ముస్లింలేనని తేల్చిచెప్పారు. దీన్ని మోహన్ భగవత్ ప్రస్తావించరని చెప్పారు. టీఎఫ్ఆర్ డేటా ఆధారంగా భగవత్ మాట్లాడాలని సూచించారు.
ఇదేనా రూల్ ఆఫ్ లా..
భారత సెక్యులరిజం అంటే ముస్లిం యువతను రోడ్లపైకీ ఈడ్చుకుని వచ్చి లాఠీలతో చావబాదడమేనా అంటూ ఒవైసీ నిలదీశారు. భారత రాజ్యంగానికి పూర్తి భిన్నమైన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని స్పష్టం చేశారాయన. రాజ్యాంగం, రూల్ ఆఫ్ లా, సెక్యులరిజం, ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వెళ్తోందని విమర్శించారు. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు.