మొదట ఫిట్స్ అనుకున్నారు!: భోజనం చేస్తూనే సోదరిపై కుప్పకూలిన దత్తాత్రేయ కుమారుడు!
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ శోకసంద్రంలో మునిగిపోయారు. తనయుడిని కోల్పోయిన బాధతో ఆయన తల్లడిల్లుతున్నారు. ఏకైక కుమారుడు వైష్ణవ్(21) మంగళవారం అర్ధరాత్రి హఠాన్మరణం చెందడంతో దత్తాత్రేయ కుటుంబాన్ని విషాదం అలుముకుంది. చిన్న వయసులోనే వైష్ణవ్ ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది.
అశ్రునయనాలతో బండారు వైష్ణవ్ అంత్యక్రియలు: పవన్ దిగ్భ్రాంతి, నిర్మలాసీతారామన్ పరామర్శ
అక్కపై ఒక్కసారిగా కుప్పకూలాడు.
రాత్రి 10.30 గంటల సమయంలో వైష్ణవ్ తన తండ్రి దత్తాత్రేయ, తల్లి వసంత, సోదరి విజయలక్ష్మీ కలసి ఇంట్లో భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో.. ఉన్నట్టుండి వైష్ణవ్ ఒక్కసారిగా పక్కనే ఉన్న సోదరిపై కుప్పకూలాడు. మొదట ఫిట్స్ వచ్చి ఉండవచ్చునని భావించారు కుటుంబసభ్యులు. హుటాహుటిన వైష్ణవ్ను ముషీరాబాద్ గురునానక్ కేర్ ఆస్పత్రికి తరలించారు.
ఫేస్ మేకర్ అమర్చినా..:
మీరు వెళ్లండి.. మేము చూసుకుంటాం అని వైద్యులు దత్తాత్రేయకు చెప్పడంతో ఆయన ఇంటికి వెళ్లిపోయారు. అయితే వైష్ణవ్ ని ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే అతని పల్స్ రేటు పూర్తిగా పడిపోయినట్టు వైద్యులు గుర్తించారు. ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్ మెంట్ అందించినా వైష్ణవ్ గుండె స్పందించలేదు. తాత్కాళికంగా ఫేస్మేకర్ అమర్చినా గుండె నుంచి ఎటువంటి స్పందనా లేదు. చివరకు వెంటిలేటర్ కూడా అమర్చి చూశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
సతీమణికి తీవ్ర అనారోగ్యం..:
వైష్ణవ్ను కాపాడేందుకు 15 మంది వైద్యులు సుమారు 2 గంటల పాటు అన్ని విధాలుగా శ్రమించారు. అయినా వైష్ణవ్ ప్రాణాలు నిలబడలేదు. దీంతో అర్ధరాత్రి 12.30 గంటలకు 'సడెన్ కార్డియాక్ అరెస్టు'తో వైష్ణవ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని దత్తాత్రేయతో పాటు ఆయన సతీమణి వసంతకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. తీవ్ర అనారోగ్యం, గుండె బలహీనత సమస్యలతో ఆమె బాధపడుతున్నందునా.. బుధవారం తెల్లవారుజామున 5గం.కి వారికి అసలు విషయం చెప్పారు. రెండు, మూడు రోజుల్లో వసంతకు కూడా ఫేస్మేకర్ అమర్చాల్సి ఉంది అని చెబుతున్నారు.
ధోబిఘాట్ లో అంత్యక్రియలు:
ఆసుపత్రి నుంచి ఉదయం 7 గంటలకు వైష్ణవ్ భౌతికకాయాన్ని రాంనగర్లోని నివాసానికి తరలించారు. దత్తాత్రేయ అభిమానులు, బీజేపీ శ్రేణులు, ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర సాగింది. మధ్యాహ్నం సైదాబాద్లోని ధోబీఘాట్ శ్మశానవాటికలో దత్తాత్రేయ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి. ఒక్కగానొక్క కొడుకు హఠాన్మరణం చెందడంతో దత్తాత్రేయ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు.