కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితి వెనక ఉన్నది ఎవరు?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లోకి రావడం దాదాపుగా ఖాయమైంది. దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రజలకు సమన్యాయం ఉండాలంటే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉండాలనేది కేసీఆర్ అభిప్రాయంగా ఉంది. ఈ నెలాఖరుకు భారతీయ రాష్ట్ర సమితి జాతీయ పార్టీని ప్రకటించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ వెనక రాజకీయ పార్టీల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నట్లు సమాచారం.

నెలాఖరున ఢిల్లీలో పార్టీ ప్రకటన?
పార్టీలకు సేవలందించడం మానేసిన ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి స్థానంతోపాటు ఆ పార్టీని అధికారంలోకి తేవడానికి ఒక ప్రణాళిక రూపొందించారు. రాహుల్గాంధీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. అక్టోబరు రెండోతేదీ నుంచి ఆయన జనజాగరణ యాత్ర ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 3వేల కిలోమీటర్లు ఆయన నడవబోతున్నారు. ఆ తర్వాత రాజకీయాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ఈలోగా కేసీఆర్ తో బీఆర్ఎస్ను ప్రారంభింపచేయబోతున్నారు. నెలాఖరులో ఢిల్లీలో పార్టీ ప్రకటన ఉంటుందని శుక్రవారం నిర్వహించిన పార్టీనేతల సమావేశంలో కేసీఆర్ తెలియజేసినట్లు సమాచారం.

రాష్ట్ర వ్యవహారాలన్నీ కేటీఆర్ చేతిలోనే!
రాష్ట్రంలో పాలనా వ్యవహారాలు, పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆరే చూసుకుంటున్నారు. కేసీఆర్ తన పూర్తిసమయాన్ని జాతీయ రాజకీయాలకు కేటాయించబోతున్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ను ప్రచారం చేసేందుకు కేసీఆర్ ప్రణాళిక రూపొందించుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈనెల రెండోతేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ మీడియాలన్నింటిలో ప్రకటనలు ఇచ్చారు. ముందుగా మీడియా ఫ్రెండ్లీగా బీఆర్ఎస్ మారాలని, ఆ తర్వాత వారినుంచి మంచి కవరేజ్ పొందవచ్చని కేసీఆర్ ఆలోచనగా ఉంది.

పార్టీ ప్రకటించిన తర్వాతే కీలకమైన నిర్ణయం
రాష్ట్ర పతి ఎన్నికల్లో అన్నాహజారేను నిలబెట్టాలనుకున్నప్పటికీ పరిస్థితులు అనువుగా లేకపోవడంతో కేసీఆర్ సైలెంటయ్యారు. రాజకీయ పార్టీ ప్రకటించగానే రాష్ట్ర పతి ఎన్నికల్లో సంచలనం కోసం ప్రయత్నించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ ఎస్ కీలకంగా మారబోతున్నట్లు కేసీఆర్ పార్టీ నాయకులకు చెప్పినట్లు తెలుస్తోంది. దేశంలో భారతీయ జనతాపార్టీ ఆగడాలు శృతిమించిపోతున్నాయని, దాని ఆగడాలకు అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీఆర్ ఎస్ ఒక్కటే ప్రత్యామ్నాయ వ్యవస్థ అవుతుందనేది కేసీఆర్ ఆలోచనగా టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications