ఎవరీ రచనా రెడ్డి : ఆమెపై కెసిఆర్ కు ఎందుకంత కోపం?
మానవహక్కుల కోణంలో రచనా రెడ్డి అనే న్యాయవాది వాదిస్తోన్న కేసులు , చేస్తోన్న పోరాటాలు పాలకులకు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. భూ నిర్వాసితుల కేసులను మానవహక్కుల కోణంలో వాదిస్తోన్న రచనా రెడ్డి పేరు ప్రస్త
హైదరాబాద్ : భూ నిర్వాసితుల తరపున ఆమె పోరాటం పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. నిర్వాసితుల తరపున ఆమె వాధిస్తోన్న కేసులు పాలకులనుఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నిర్వాసితుల తరపున పోరాటం చేస్తోన్న రచనా రెడ్డి పేరు చెబితేనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. భూసేకరణ చట్టంపై చర్చ సందర్భంగా రచనా రెడ్డి పేరును పదే పదే ప్రస్తావించారు సిఎం కెసిఆర్.మానవహక్కుల కోణంలో భూ నిర్వాసితుల కేసులను వాదిస్తోన్న రచనారెడ్డి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.
మెదక్ కు సమీపంలోని నాగిరెడ్డి పేటకు చెందిన రచనారెడ్డి పూణెలో చదువుకొంది. అమెరికాలో మాస్టర్స్ చేసింది. అక్కడే ల్యూసెస్టర్ యూనివర్శిటీలో అంతర్జాతీయ మానవహక్కుల అంశంపై పిహెచ్ డి చేస్తోంది. మూడేళ్ళపాటు అక్కడే ప్రాక్టీసు కూడ చేసింది.ఇటీవలే ఆమె ఇండియాకు తిరిగి వచ్చింది.
హైద్రాబాద్ లోని నల్సార్ యూనివర్శిటీలో ఆమె అసిస్టెంట్ ప్రోఫెసర్ గా పనిచేస్తోంది.తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కల్గించిన పలు కేసులను ఆమె వాదించింది. ఈమె వాదన పటిమతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.
సిఎంఓ అధికారిణి ,ఐఎఎస్ అధికారి స్మీతా సబర్వాల్ పై అవుట్ లుక్ మేగజైన్ రాసిన కథనంపై స్మిత సబర్వాల్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును స్మిత తరపున వాదించింది కూడ రచనా రెడ్డియే.
ముఖ్యమంత్రి కెసిఆర్ రచనా రెడ్డిపై ఎందుకు ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది. మానవహక్కులపై పిహెచ్ డి చేస్తోన్న రచనా రెడ్డి అదే కోణంలోనే తన కేసులను వాదిస్తోంది.
ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం భూ సేకరణ చేస్తోంది. అయితే ఈ భూసేకరణ సందర్భంగా నిర్వాసితుల తరపున ఆమె వాదిస్తోంది. ఆమె వాదనసమయంలో మానవహక్కుల కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ఆమె చట్టాలతో పాటు నిర్వాసితుల హక్కులను ప్రస్తావిస్తున్నారు.
భూ నిర్వాసితుల పట్ల పాలకులు అనుసరించే విధానాలను ఆమె తప్పుబడుతున్నారు. మానవ హక్కులను హరించే విధంగా పాలకులు భూములను సేకరిస్తున్నారని రచనారెడ్డి తన వాదనల ద్వారా నిరూపిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పాలకులకు కన్నెర్ర కలిగేలా చేస్తున్నాయి.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద భూముల సేకరణకు సంబందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 123 జివో కింద పరిహరం చెల్లిస్తోంది.అయితే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు.అయితే 123 జివోలో కొన్ని మార్పులు చేసి కొత్త చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్రం ఆమోదం కోసం పంపింది.
మూడు రోజుల క్రితం 123 జివో అనుసరించి భూములను సేకరించకూడదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసును కూడ రచనారెడ్డి వాదించారు. ఈ ఉత్తర్వులు రాకముందే అసెంబ్లీలో భూసేకరణ చట్టంపై చర్చ సాగింది.
ఈ చర్చ సందర్భంగా కెసిఆర్ ఆమె పేరును ప్రస్తావిస్తూ మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు రికార్డు కావాలని చెప్పారు. ఈ మేరకు ఆమె పేరును తీసుకొని మరీ కొత్త చట్టం ప్రభుత్వం ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో కెసిఆర్ వివరించారు. ముంపుభాదితులు ఆమె దేవతగా చూస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే తెచ్చింది కూడ రచనారెడ్డి.
మానవహక్కులను దృస్టిలో ఉంచుకొని ఆమె చేసే వాదనలు చేస్తోంది.దీంతో బాదితులు ఆమెను ఆరాధనగా చూస్తున్నారు. తాను వాదిస్తోన్న కేసుల్లో విజయం సాధించాలని కోరుకొంటారు. అయితే ఈ విజయం మానవహక్కుల కోణంలో ఉంటే ఈ అంశాన్ని మరింత లోతుల్లోకి వెళ్ళి అథ్యయనం చేసి వాదించడం పాలకులకు ఇబ్బందులకు తెచ్చిపెడుతోంది.