చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు: కేసీఆర్పై అస్త్రాలున్నాయా లేక..!?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర సమితి దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే టీడీపీ నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నుండి మంత్రి అచ్చెన్నాయుడు వరకు ఘాటుగా మాట్లాడుతున్నారు.
మీకు ఏసీబీ ఉంటే మాకు ఏసీబీ ఉందని, మీకు పోలీసులు ఉంటే మాకూ ఉన్నారని మూడు రోజుల క్రితం చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను కన్ను తెరిస్తే కేసీఆర్ అంతేనని, ఇంతటితో ఆపేయాలని లేదంటే తాను కేసీఆర్ పైన ఒక్కో అస్త్రాన్ని తీస్తానని హెచ్చరించారు.
మరోవైపు, ఏసీబీ చంద్రబాబుకు రేపో మాపో నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని చెప్పారు.
చంద్రబాబు బుధవారం ఓ జాతీయ టీవీ ఛానల్తో మాట్లాడుతూ... తన అరెస్టుకు యత్నిస్తే కేసీఆర్కు ముఖ్యమంత్రిగా అదే ఆఖరి రోజు అని తీవ్రంగా హెచ్చరించారు. తనను అరెస్టు చేసేందుకు ఆయన ఎవరని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలంగాణ, ఏపీ టీడీపీ నేతలు కూడా కేసీఆర్ పైన ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్ ఒక అడుగు వేస్తే మేం వంద అడుగులు వేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పైన చంద్రబాబు వద్ద ఆధారాలు ఉన్నాయా? లేక ఒత్తిడిలో ఏం చేయాలో తెలియక అలా మాట్లాడుతున్నారా? అనే చర్చ సాగుతోంది.
కేసీఆర్ పైన ఇప్పటి వరకు రాజకీయంగా ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై చంద్రబాబు వద్దా ఆధారాలున్నాయా లేక ఘాటుగా స్పందించే ఉద్దేశ్యంలో భాగంగా అలా మాట్లాడుతున్నారా అనే చర్చ సాగుతోంది.
ఉద్యమం సమయంలో తెరాస నేతలు డబ్బులు వసూలు చేశారని, మెట్రో వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనే రాజకీయ పరమైన ఆరోపణలు ఉన్నాయి. కానీ, కేసీఆర్ గురించి ఒక్కో అస్త్రం తీస్తానని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో అది చర్చనీయంశమవుతోంది.
చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, ఆయనకు అరెస్టు భయం పట్టుకుందని, ఈ క్రమంలో చంద్రబాబు తెలగాణ సర్కారు పైన ఎదురు దాడికి దిగుతున్నారని నమస్తే తెలంగాణ రాసింది. ఎన్డీటీవీతో మాట్లాడుతున్న సమయంలో బాబు ముఖంలో అరెస్టు భయం స్పష్టంగా కనిపించిందని రాసింది.