మూడు ముక్కలాట: కెసిఆర్ వారసుడి చర్చకు కవిత ఎందుకు తెరలేపారు?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఘనమైన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయ, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల వారసత్వ చర్చను తెర మీదికి తెచ్చారు. ఆమె ఆ చర్చ తేవడంలోని ఆంతర్యం ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
చాలా కాలంగా హరీష్ రావుకు ప్రాధాన్యం తగ్గించి కెసిఆర్ తన కుమారుడు కెటి రామారావుకు ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కెటి రామారావు అంతా తానై వ్యవహరించి తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టడం, ఆ విజయానికి కెసిఆర్ పుత్రుడికి కానుకగా అదనపు శాఖను కేటాయించడం వరుసగా జరిగిపోయాయి.
కెటిఆర్ హైదరాబాదు ఎన్నికల్లో తలమునకలవుతున్న సమమయంలో హరీష్ రావు నారాయణఖేడ్ శాసనసభ ఉప ఎన్నిక ప్రచారంలో మునిగిపోయారు. దాదాపుగా ఆయన హైదరాబాద్ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఈ స్థితిలో హరీష్ రావుకు ప్రాధాన్యం తగ్గుతూ కెటిఆర్కు ప్రాధాన్యం పెరుగుతుందనే ప్రచారం తప్పలేదు.
అయితే, ఆ ప్రచారానికి కవిత ప్రకటన ఆజ్యం పోసినట్లయింది. ఒక రకంగా అది పార్లీలో అంతర్గత తగాదాలకు లేదా వివాదాలకు దారి తీసే విధంగా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిజానికి, హరీష్ రావు పార్టీ స్థాపన నుంచి కెసిఆర్ పక్కన ఉన్నారు. కెసిఆర్ తర్వాత హరీష్ రావు అనే మాట చెలామణి అవుతూ వచ్చింది. ఆ స్థితిలో కెటిఆర్ రంగ ప్రవేశం చేశారు. అమెరికాలో ఉద్యోగం వదిలేసి తెరాసలో కీలక పాత్ర పోషిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావుతో పాటు కెటిఆర్కూ మంత్రి పదవి దక్కింది. నిజానికి, కెటిఆర్ రావడంతోనే హరీష్ రావు ప్రాధాన్యం తగ్గుతుందనే ప్రచారం మొదలైంది. అయితే, కెటిఆర్ గానీ హరీష్ రావు గానీ అటువంటి ప్రచారాన్ని బలపరిచే చర్యలకు ఏ మాత్రం తావు ఇవ్వలేదు.
ఇక, రాజకీయాల్లోకి రావాలనే కవిత ఆసక్తిపై కెసిఆర్, కెటిఆర్ నీళ్లు చల్లుతూ వచ్చారని అంటారు. ఉద్యమ పార్టీలో పనిచేయడం అంత తేలిక కాదని, ఇప్పటికే ముగ్గురం ఉన్నామని చెబుతూ వచ్చారని అంటున్నారు. అయితే, కవిత దాంతో ఆగకుండా తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి సాంస్కృతికోద్యమానికి నాయకత్వం వహించడం ద్వారా తన నైపుణ్యాన్ని, చతురతను ప్రదర్శించారు. బతుకమ్మను తెలంగాణలో ఊరేగించి, వీధివీధినా ఆడించి ఉద్యమానికి ఆమె ఊపు తెచ్చారు.
ఆ స్థితిలో కల్వకుంట్ల కవితకు కెసిఆర్ నిజామాబాద్ పార్లమెంటు సీటు ఇవ్వక తప్పలేదు. ప్రజాదరణ ఉన్న మధుయాష్కీని ఓడించి ఆమె ఎన్నికల రాజకీయాల్లో కూడా రాణిస్తానని నిరూపించారు. అయితే, ఆమెకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో ఏ విధమైన పాత్ర కూడా లేకుండా పోయింది. ముఖ్యమైన నేతగా గుర్తింపు ఉన్నప్పటికీ హరీష్ రావు, కెటిఆర్ మాత్రమే ప్రధానంగా వ్యవహారాలు నడుపుతూ వస్తున్నారు. బహుశా, ఇదే ఆమె చేత వారసత్వం చర్చను ముందు తెప్పించి ఉంటుందని అనుమానిస్తున్నారు.
దాదాపుగా తాను ఆ పోటీలో లేకపోవడంతో వారసత్వ చర్చను కల్వకుంట్ల కవిత ముందుకు తెచ్చి ఉంటారనే అభిప్రాయం కూడా ఉంది. పార్లమెంటు సభ్యురాలు కావడంతో, రాష్ట్ర వ్యవహారాల్లోనూ పార్టీ వ్యవహారాల్లోనూ ఆమెకు పెద్ద ప్రాధాన్యం లేకపోవడం ఆమె చేత ఆ ప్రకటన చేయించి ఉండవచ్చునని అంటున్నారు.