మేయర్ పీఠం: 'మజ్లిస్ దాడిపై మౌనమెందుకు?', కెసిఆర్! మా గతే మీకు: విహెచ్
హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి ఇంటి పైన మజ్లిస్ నేతలు దాడి చేసి రెండు రోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పందించకపోవడం దారుణమని శాసన మండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి గురువారం మండిపడ్డారు.
మీర్ చౌక్ పోలీసు స్టేషన్లో తమ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీల పైన కేసులు పెట్టడం విడ్డూరమన్నారు. వెంటనే వారి పైన పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇంతలా దాడి జరిగినా కెసిఆర్ మౌనంగా ఉండటానికి మేయర్ పదవి కోసమే అని ఆరోపించారు. మేయర్ పదవి కోసం ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బిజెపి నేతల పైన దాడి జరిగినా మజ్లిస్ పార్టీ విషయంలో కెసిఆర్ మౌనంగా ఉండటం సరికాదన్నారు.
కెసిఆర్కు మేయర్ పదవి తప్ప ఏదీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. న్యాయం అడగడానికి వెళ్లిన వారి పైన కేసులు పెట్టడం ఎక్కడా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మజ్లిస్ పార్టీ నేతల ఆగడాలకు చట్టపరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు.
మోడీతో అసదుద్దీన్ చేతులు కలిపారు: విహెచ్
కాంగ్రెస్ పార్టీని నష్టపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో మజ్లిస్ పార్టీ చేతులు కలిపిందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు అన్నారు. మజ్లిస్ పార్టీ పైన టిఆర్ఎస్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలన్నారు. వారితో కెసిఆర్ కలిస్తే తమకు పట్టిన గతే వారికి కూడా పడుతుందని హెచ్చరించారు. మజ్లిస్ పార్టీకి సహకారం అంటే పాముకు పాలు పోసి పెంచడమే అన్నారు.