మతపరమైనవా: కిషన్, కవితచే తెరాస అమెరికా శాఖ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి మతానికి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పడం విడ్డూరమని, మతాల పేరిట ప్రజలను విభజించడం సమంజసం కాదని, ఇది ఎవర్ని బుజ్జగించడానికో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, అంబర్ పేట శాసన సభ్యుడు కిషన్ రెడ్డి ఆదివారం అన్నారు.
ముస్లీంల గురుకులాలు మదర్సాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ముస్లీంలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అంటే తెరాస ప్రభుత్వం 12 శాతం అని చెబుతోందని, మతపరమైన రిజర్వేషన్లకు తాము పూర్తి వ్యతిరేకమన్నారు. జిల్లా కలెక్టర్లు పాఠశాలలకు వెళ్లి తరగతులు చెప్పాలని ముఖ్యమంత్రి సూచిస్తున్నారని, ఉపాధ్యాయులు లేకుండా నాణ్యమైన విద్య ఎలా సాధిస్తామో చెప్పాలన్నారు.
తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సులర్లు లేరని, ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయని, 14వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయన్నారు. రేషనలైజేషన్ పేరిట ప్రభుత్వ పాఠశాలలు మూసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కొన్ని విశ్వవిద్యాలయాలు కళాశాలలను తలపిస్తున్నాయన్నారు.
10 కోట్లతో జర్నలిస్ట్ భవన్: హరీష్ రావు
హైదరాబాదులో రూ.10 కోట్లతో తెలంగాణ జర్నలిస్ట్ భవన్ ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు ఆదివారం అన్నారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టీయూడబ్ల్యూజే) (ఐజేయూ అనుబంధం) ప్రథమ మహాసభ ఆదివారం హైదరాబాద్ పబ్లిక్గార్డెన్స్లోని తెలుగు లలితకళాతోరణంలో జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడురు.
అంతర్జాతీయస్థాయిని అందుకునేలా పాత్రికేయులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరముందన్నారు. ఇందుకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉన్నారన్నారు. పాత్రికేయులకు అక్రిడేషన్లు, రూ.2 లక్షల విలువ చేసే వైద్య సేవలను అందిస్తామన్నారు. ఇళ్లస్థలాలతో పాటు రూ.4 లక్షలతో రెండు పడకల ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.
అమెరికాలో తెరాస శాఖ
తెలంగాణ రాష్ట్ర సమితి అమెరికా శాఖను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం అమెరికాలోని మిన్నియాపోలిస్ నగరంలో ప్రారంభించారు. అక్కడి స్థానికులతో కలిసి మిన్నెసోటాలోని హిందు దేవాలయంలో ఆమె పూజలు చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. వీటికి అమెరికా శాఖ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. పార్టీకి, ప్రవాస తెలంగాణ సమాజానికి ఈ విభాగం వారధిగా పని చేయాలన్నారు.