దారుణం: ఫోన్ లో మాట్లాడుతుందని మందలించిన భర్త.. గొంతు నులిమి చంపిన భార్య
ఒకప్పుడు భార్య కోసం భర్త, భర్త కోసం భార్య ఎటువంటి త్యాగానికైనా వెనుకాడే వారు కాదు. భార్యాభర్తలు అంటే ఒకరికి ఒకరుగా జీవనం సాగించేవారు. ఒకరికి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు సర్దుకుపోవడం, ఒకరి సమస్యలను ఇంకొక అర్థం చేసుకోవడం భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం సజావుగా సాగేలా చేస్తుంది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవు. చిన్న కారణాలకే భార్య భర్తలు గొడవలు పడటం, ఆపై ఒకరినొకరు హతమార్చుకునే దాకా వెళ్లడం ప్రస్తుత సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

హత్యకు దారితీసిన భార్యాభర్తల మధ్య ఘర్షణ
భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా చోటుచేసుకుంటున్న హత్యలు పెరిగిపోతున్న తీరు మానవ సంబంధాలను, అనుబంధాలను ప్రశ్నిస్తున్నాయి. ఇక తాజాగా చోటుచేసుకున్న ఓ షాకింగ్ ఘటన భర్త ప్రాణాలు తియ్యగా, భార్యను జైలుపాలు చేసింది. ఇక వీరి కారణంగా పిల్లలు అనాధలుగా మిగిలిపోయారు. తమకే పాపం తెలియని చిన్నారుల జీవితాలకు ఆ తల్లిదండ్రులు తమ చర్యలతో ఊహించని శిక్ష వేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే

ఫోన్ లో గంటలతరబడి మాట్లాడుతుందని భార్యను హెచ్చరించిన భర్త
పెద్దపల్లి ఎన్టిపిసి ఆటో నగర్ కు చెందిన అజీమ్ ఖాన్ అదే కాలనీకి చెందిన శ్రావణి ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మతాలు వేరైనప్పటికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడంతో వీరి పెళ్లి జరిగిపోయింది . పెళ్లయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరూ శ్రావణి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. అయితే శ్రావణి ఇటీవల ఓ కార్పొరేట్ కంపెనీలో పని చేయడానికి వెళుతుంది. ఈ క్రమంలో రోజూ శ్రావణి ఫోన్ లో గంటల తరబడి మాట్లాడుతుండటాన్ని గమనించిన భర్త, భార్య ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు.

ఫోన్ విషయంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ.. భర్త గొంతు నులిమేసిన భార్య , భర్త మృతి
అయితే భర్త హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని శ్రావణి అదే పంథాను కొనసాగించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అజీం ఖాన్, భార్య శ్రావణి తో, అత్త నర్మదాతో గొడవకు దిగాడు. గొడ్డలి తీసుకుని రోడ్డు మీదికి వచ్చి ఇద్దరిని చంపి పారేస్తానంటూ చిందులు వేశారు. దీంతో శ్రావణి, అత్త నర్మద అజీమ్ ఖాన్ ను ఇంటి లోపలికి లాక్కెళ్ళి అతనిపై దాడికి దిగారు. భర్తను శ్రావణి గట్టిగా గొంతు నులమడంతో ఊపిరాడక అతను కిందపడిపోయాడు. దీంతో అజీమ్ ఖాన్ స్పృహ కోల్పోవడం గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో, అక్కడకు వచ్చిన 108సిబ్బంది అజీమ్ ఖాన్ మృతి చెందినట్టు నిర్ధారించారు.

కేసు నమోదు చేసిన భర్తను చంపిన భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు ..అనాధలైన చిన్నారులు
దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న గోదావరిఖని పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్త మరణానికి కారణమైన భార్య శ్రావణిని అరెస్ట్ చేసిన పోలీసులు, కేసు దర్యాప్తు చేస్తున్నారు. భార్యభర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హత్యకు దారితియ్యగా అభం శుభం తెలియని చిన్నారులు మాత్రం తండ్రి చనిపోయి, తల్లి జైలు పాలై దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.












Click it and Unblock the Notifications