వివాహేతర సంబంధం: ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన భార్య
భర్త నరేందర్ రెడ్డి స్వగ్రామానికి తిరిగి వచ్చేయడం అరుణ-మహేష్ ల వివాహేతర సంబంధానికి అడ్డంకిగా మారింది.
దేవరకద్ర: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన జోగులాంబ జిల్లా దేవరకద్ర మండలంలోని హజిలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం భర్త హైదరాబాద్ వెళ్లగా.. స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్న భార్య.. భర్త ఇంటికి తిరిగి రాగానే ప్రియుడితో కలిసి హత్య చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. హజిలాపూర్ గ్రామానికి చెందిన నరేందర్రెడ్డి(38)కి పుసుపుల గ్రామానికి చెందిన అరుణతో వివాహమైంది. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. బతుకుదెరువు కోసం ఇటీవల హైదరాబాద్కు వెళ్లిన నరేందర్ రెడ్డి కొంతకాలం అక్కడే పనిచేశాడు. ఈ క్రమంలో లక్ష్మిపల్లి గ్రామానికి చెందిన మహేష్ తో అరుణకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
కాగా, హైదరాబాద్ నుంచి ఓ నెల రోజుల కిందటే సొంత గ్రామానికి చేరుకున్న నరేందర్ రెడ్డి వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నరేందర్ రెడ్డి స్వగ్రామానికి రావడం అరుణ-మహేష్ ల వివాహేతర సంబంధానికి అడ్డంకిగా మారింది. దీంతో ఎలాగైనా నరేందర్ రెడ్డి అడ్డు తొలగించుకోవాలని భావించారు.
బుధవారం రాత్రి ప్రియుడు మహేష్, కుమారుడితో కలిసి పొలం వద్దనున్న భర్త నరేందర్ రెడ్డిని కలవడానికి వెళ్లింది అరుణ. పొలం వద్ద నరేందర్ రెడ్డికి, మహేష్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ప్రియుడితో కలిసి నరేందర్ రెడ్డిని తాడుతో గొంతు నులిమి అరుణ హత్య చేసింది. ఆపై అనుమానం రాకుండా ఉండటం కోసం పొలం వద్దనున్న విద్యుత్ తీగ వద్ద మృతదేహాన్ని పడేసి.. విద్యుత్ షాక్ తో చనిపోయాడని గ్రామస్తులకు సమాచారం అందించారు.
అనంతరం పోలీసులకు కూడా సమాచారం అందడంతో.. సంఘటనా స్థలాన్ని పరిశీలించి అరుణ కుమారుడిని పోలీసులు ప్రశ్నించారు. దీంతో తన తండ్రిని తల్లే హత్య చేసిందని బాలుడు పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.