మరదళ్లు, అత్తతో అసభ్య ప్రవర్తన: అందుకే గొడ్డలితో నరికేసిన ఆ భార్య!
వరంగల్: భర్తను గొడ్డలితో నరికి, ఆ తర్వాత అతని శవాన్ని తల్లి సాయంతో స్నానాల గదిలో పూడ్చిన సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. అనంతరం ఆమె పోలీస్ స్టేషన్కు స్వయంగా వచ్చి లొంగిపోయింది. భర్త పేరు నాగరాజు. భర్తను చంపిన ఆమె పేరు అనూష.
పెళ్లైన రెండేళ్లకే ఈ దారుణం జరిగిన విషయం తెలిసిందే. భూపాలపల్లి మండలం జంగేడులో ఇది సంచలనం సృష్టించింది. నర్సయ్య, నిర్మల దంపతుల కూతురు అనూషకు పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన నాగరాజుతో పెళ్లయింది. అనుష తండ్రి నర్సయ్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.
దీంతో నిర్మల తన కూతురు, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంది. ఈ ముగ్గురూ జంగేడులో ఉంటున్నారు. బొగ్గు రవాణా విభాగంలోనే కార్మికుడిగా పని చేస్తున్న నాగరాజుకు పెళ్లయినప్పటి నుంచి భార్య అనూషతో విభేదాలు ఉన్నాయి. గతంలోనూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రెండు రోజుల క్రితం నాగరాజు తన తల్లి నిర్మలతో దురుసుగా ప్రవర్తించాడని, సర్దిచెప్పేందుకు యత్నించిన తనపై గొడ్డలితో దాడికి యత్నించడంతో తనను తాను కాపాడుకునేందుకు అదే గొడ్డలితో నాగరాజు తలపై కొట్టానని అనూష పోలీసులకు తెలిపింది. నాగరాజు అక్కడిక్కడే మృతిచెందాడు.
ఈ విషయం ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో ఇంటి పక్కనే ఉన్న స్నానాలగదిలో గొయ్యితీసి తల్లీకూతుళ్లు మృతదేహన్ని పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ఇద్దరు బంధువుల ఇంటికి వెళ్లారు. పూడ్చిపెట్టిన మృతదేహం ఎప్పటికైనా బయటపడుతుందనే భయంతో అనూష భూపాలపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయింది. నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, ఈ హత్యలో మరో వాదన కూడా వినిపిస్తోంది. అతను కామంతో కళ్లు మూసుకొని పోయి అత్తను, ఇద్దరు మరదళ్లను లైంగిక వేధింపులకు గురి చేసేవాడని, అందుకే భార్య అతనిని కడతేర్చిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
నాగరాజు మద్యానికి బానిసై మరదళ్లతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అత్తను లైంగికంగా వేధించేవాడంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున అత్తతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమె కేకలు వేయడంతో నిద్రలేచిన అనూష అతనిని హెచ్చరించిందని, అతను గొడ్డలితో బెదిరించాడని, దీంతో ఆమె తిరగబడి అదే గొడ్డలితో చంపిందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా నాగరాజు అమాయకుడని, అందరితో కలివిడిగా ఉండేవాడనని మరికొందరు అంటున్నారు.