పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి: మరో మహిళతో భర్త, పిల్లలను బావిలో పడేసిన భార్య
నిజామాబాద్: వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలను ఇంట్లోని బావిలో పడవేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా, ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన కామారెడ్డి మండలం గర్గుల్లో ఆదివారం చోటు చేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆరేళ్లక్రితం గర్గుల్కు చెందిన రజిత తల్లిదండ్రులను ఎదిరించి అదే గ్రామానికి చెందిన బొంబోతుల మహేశ్గౌడ్ను ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. సంవత్సరం పాటు అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో దంపతుల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి.
అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మహేశ్గౌడ్ గ్రామంలోనే కల్లు దుకాణంలో పనిచేసేవాడు. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న రజితకు అప్పటి నుంచి భర్త వేధింపులు మొదలయ్యాయి. అటు తల్లిదండ్రుల నుంచి ఓదార్పు లేక.. ఇటు అత్తమామలతో ఉన్నా భర్తతో వేధింపులు ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయి.
కాగా, తన భర్త ఎప్పటికైనా మారతాడని ఎదురుచూస్తున్న రజితకు ఊహించని షాక్ తగిలింది. మహేష్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న విషయం ఆమెను మరింత కుంగదీసింది. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక రజిత తీవ్ర మనస్థాపానికి గురైంది.
అయితే మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో మహేశ్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కేసు పెట్టింది. దీంతో లక్ష రూపాయల వరకు జరిమానా విధించగా ఆ డబ్బులు చెల్లిస్తే భర్త తనవాడు అవుతాడని భావించిన ఆమెకు చుక్కెదురైంది. మహేశ్గౌడ్లో మార్పు రాకపోగా వేధింపులు ఎక్కువయ్యాయి.
గత కొంతకాలంగా మహేష్గౌడ్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఇంటికి అప్పుడప్పు డు వచ్చేవాడు. ఇదేక్రమంలో వీరికి గత 10నెలల క్రితమే కవల పిల్లలు జన్మించారు. బీడీలు చుడుతూ సంసారాన్ని నెట్టుకొస్తున్నప్పటికీ పిల్లల ఆలనాపాలన రజితకు భారంగా మారింది.
మరో వైపు భర్త వేధింపులు మాత్రం ఆగలేదు. భర్త ఇంటికి రోజూ రాకుండా కామారెడ్డిలోనే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అక్కడే ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. కుటుంబ పోషణకు డబ్బులు ఇవ్వకుండా సూటిపోటి మాటలతో రజితను వేధించేవాడు భర్త.
గత 15 రోజుల క్రితమే తమ పిల్లలకు పుట్టువెంట్రుకలు కూడా తీశారు. తన వద్దకు తల్లిదండ్రులు కూడా రాకపోవడంతో రజిత తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో రజిత తనకు ఆత్మహత్యే శరణ్యమని భావించింది. అయితే, తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారని తలచిన రజిత వారిని కూడా చంపాలని నిశ్చయించుకుంది.
ఆదివారం ఉదయం తన ఇంట్లో ఉన్న చేతబావిలో తన పిల్లలు కౌశిక్గౌడ్(10 నెలలు), కీర్తన(10నెలలు)లను ముందుగా బావిలో పడవేసి తానూ బావిలో దూకింది. కాసేపటికే పిల్లలు మృతి చెందగా, బావిలో ఆమె మునిగేలా నీళ్లు లేకపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. దీంతో ఏమీ తోచని రజిత కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిని బయటకు తీశారు.
ఇద్దరు పిల్లలు అప్పటికే చనిపోగా రజితను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన రజిత చికిత్స అనంతరం గంట తర్వాత మెళకువకు వచ్చింది. ఇద్దరు పిల్లలు చనిపోయారనే విషయం తెలిసి రజిత కన్నీటిపర్యాంతమైంది.
కామారెడ్డి డీఎస్పీ భాస్కర్, రూరల్ సీఐ కోటేశ్వర్రావు, ఎస్సై నవీన్కుమార్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రజిత భర్త మహేశ్ వేధింపుల కారణంగానే రజిత ఇద్దరు పిల్లలతోపాటు ఆత్మహత్యయత్నం చేసిందని డీఎస్పీ చెప్పారు. మహేశ్ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.